హైదరాబాద్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ)వార్నింగ్ ఇచ్చింది. రాజకీయ పార్టీలు, వ్యక్తులపై నిందారోపణలు చేయడం సరికాదని ఆమెను హెచ్చరించింది. ఇకపై ఎన్నికల సభలు, సమావేశాలు, పత్రికా సమావేశాల్లో ఎన్నికల కోడ్ ఉల్లంఘించే విధంగా మాట్లాడొద్దని సూచిస్తూ శుక్రవారం ఆమెకు ఓ లేఖ రాసింది. ఈ నెల 1న కొండా సురేఖ వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్, కేటీఆర్లపై వ్యక్తిగత ఆరోపణలు చేసిన విషయం విదితమే. దీనిపై బీఆర్ఎస్ నేతలు కర్నె ప్రభాకర్, దాసోజు శ్రవణ్ ఫిర్యాదు చేయడంతో ఎన్నికల సంఘం స్పందించింది. ఆ మీడియా సమావేశంలో సురేఖ ఏం మాట్లాడారో నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించింది. ఫిర్యాదులో పేర్కొన్న విధంగానే సురేఖ వ్యాఖ్యలు ఉన్నాయని కలెక్టర్ ధ్రువీకరించడంతో ఆమెను ఎన్నికల సంఘం హెచ్చరించింది.