హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల (Telangana Assembly Elections) నోటిఫికేషన్ శుక్రవారం విడుదల కానుంది. అదే రోజు నుంచి నామినేషన్లు ప్రారంభమవుతాయి. ఈ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల ఐఏఎస్, ఐపీఎస్ అధికారలను ఎన్నికల పరిశీలకులుగా కేంద్ర ఎన్నికల సంఘం (CEC) నియమించింది. సాధారణ పరిశీలకులుగా 67 మంది ఐఏఎస్ అధికారులు, 39 మంది ఐపీఎస్ అధికారులను పోలీస్ పరిశీలకులుగా నియమించింది. వీరంతా ఈ నెల 10 నుంచి రంగంలోకి దిగనున్నారు.
ఎన్నికల నోటిఫికేషన్ రేపు విడుదల కానుంది. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి నామినేషన్లు ప్రారంభం కానున్నాయి. ప్రతి రోజు మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ నెల 5న ఆదివారం సెలవు కావడంతో నామినేషన్లు స్వీకరించరు. ఈ నెల 10న నామినేషన్ల గడువు ముగియనుంది. 13వ తేదీన అభ్యర్థుల నామినేషన్లను పరిశీలిస్తారు. 15వ తేదీ వరకు నామినేషన్ ఉపసంహరణకు గడువు ఇచ్చారు. అదే రోజు తుది జాబితాను ప్రకటిస్తారు. ఈ నెల 30న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడుతాయి.