జమ్మికుంట/ఇల్లందకుంట/ హుజూరాబాద్, సెప్టెంబర్ 6: ఈటల రాజేందర్ దద్దమ్మ, సంస్కారహీనుడు అని పలువురు టీఆర్ఎస్ దళిత ప్రజాప్రతినిధులు విమర్శించారు. హుజూరాబాద్ నియోజకవర్గానికి నాలుగు వేల డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేస్తే ఒక్కటి కూడా కట్టించలేకపోయాడని పేర్కొన్నారు. ఆయనను బీజేపీలో ఎవరూ పట్టించుకోవడం లేదని, సోషల్ మీడియానే నమ్ముకున్న ఈటల ఓడిపోవడం ఖాయమని చెప్పారు. దళిత ఎమ్మెల్యేలపై నోరు పారేసుకోవడం, ఎవరినిపడితే వారిని వాడు, వీడు, రా అని సంబోధించడం తగదని హితవు చెప్పారు. ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకునేది లేదని, సహనాన్ని పరీక్షించవద్దని హెచ్చరించారు. ఈటల రాజేందర్ పద్ధతి మార్చుకోవాలని, దళిత ఎమ్మెల్యేలపై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వర్రావు నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. ఈటలకు ఓటమి భయం పట్టుకున్నదని, బీజేపీలో ఆయనను ఎవరూ పట్టించుకోవడం లేదని, ఒంటరిగా మిగలడం ఖాయమని చెప్పారు. రాజకీయ భవిష్యత్తును అందించిన సీఎం కేసీఆర్ను, ఉద్యమ సహచరుడు హరీశ్రావును విమర్శించే స్థాయి ఈటలకు లేదని పేర్కొన్నారు. కన్నెర్రా జేస్తా అంటున్న ఈటల ఏడేండ్లుగా అభివృద్ధి ఎందుకు చేయలేదో చెప్పాలని నిలదీశారు. సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, నాయకులు పోల్నేని సత్యనారాయణరావు, మొలుగు పూర్ణచందర్, తొగరు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
అధికారంలో ఉండీ ఏమీచేయని దద్దమ్మ: ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
అధికార పార్టీలో మంత్రిగా ఉండి కూడా నియోజకవర్గానికి ఏమీ చేయలేని దద్దమ్మ ఈటల ఇప్పుడేమి అభివృద్ధి చేస్తాడని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రశ్నించారు. ఇల్లందకుంటలో సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావుతో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. దళితబంధుపై విషం గక్కిన ఈటల గెలిస్తే నిజంగా దళితులకు ఏమన్నా చేస్తాడా? అని నిలదీశారు. బడుగు, బలహీన వర్గాలంటేనే ఈటలకు అలర్జీ అని పేర్కొన్నారు. దళిత ఎమ్మెల్యేలను దూషించడం ఈటల అహంకారానికి నిదర్శనమన్నారు. ఈటల బామ్మర్ది దళిత బిడ్డలను తిట్టాడని, కొడుకు దళిత మహిళను బెదిరించాడని చెప్పారు.
బేషరతుగా క్షమాపణలు చెప్పాలి: బాల్క సుమన్
దళిత ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్య లు చేసిన ఈటల బేషరతుగా క్షమాపణలు చెప్పకపోతే దళితజాతి ఊరుకోదని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ హెచ్చరించారు. సోమవారం ఆయన హుజూరాబాద్లో విప్ గువ్వల బాలరాజు, ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, సండ్ర వెంకటవీరయ్యతో కలిసి మీడియాతో మాట్లాడారు. డబ్బుందన్న అహంకారంతో దళిత ఎమ్మెల్యేలను కించపరిచేలా మాట్లాడ టం తగదన్నారు. సీఎం కేసీఆర్పై, మంత్రి హరీశ్రావుపై పరుష పదజాలం వాడిన తీరును మేధావులు గమనించాలని కోరారు. ఉప ఎన్నికలో ప్రచారానికి అన్ని ప్రాంతాలవారు వస్తారని, గతంలో ఈటల కూడా ఇతర నియోజవర్గాలకు వెళ్లి ప్రచారం చేశారని చెప్పారు.
దళితవాడలకొస్తే తరిమికొట్టాలి: గువ్వల బాలరాజు
దళిత ఎమ్మెల్యేలను కించపరిచేవిధంగా మాట్లాడిన బీజేపీ నేత రాజేందర్ దళితవాడలకొస్తే తరిమికొట్టాలని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు పిలుపునిచ్చారు. దళితుల జీవితాలు మార్చేందుకు ప్రణాళిక సిద్ధంచేయాలని సీఎం కేసీఆర్ ఈటలకు రెండేండ్ల క్రితమే చెప్పినా ఆయన ఆ పని చేయలేదని పేర్కొన్నారు. తన వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడం తప్ప నియోజకవర్గం కోసం ఈటల చేసిందేమీలేదని దుయ్యబట్టారు. నమస్కారం పెడితే కనీసం ప్రతి నమస్కారం పెట్టని సంస్కారహీనుడని విమర్శించారు.
దళితవాడలకు రానిచ్చేదేలేదు: అరూరి రమేశ్
ఆరుసార్లు ఎమ్మెల్యేగా, మూడుసార్లు మంత్రిగా పనిచేసిన ఈటల సంస్కారహీనంగా మాట్లాడుతున్నారని వర్ధన్నపేట ఎమ్మె ల్యే అరూరి రమేశ్ మండిపడ్డారు. దళిత ఎమ్మెల్యేలపై చేసిన అనుచిత వ్యాఖ్యలతో ఈటల అసలురంగు బయటపడిందని పేర్కొన్నారు. ‘ఈటల రాజేందర్ ఖబడ్దార్.. నిన్ను దళితవాడలకు రానిచ్చేదేలేదు’అని హెచ్చరించారు.