మెదక్ మున్సిపాలిటీ, ఏప్రిల్ 17 : ఈస్టర్ పండుగను పురస్కరించుకుని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెదక్ చర్చిలో ఆదివారం తెల్లవారు జామున 4.30 గంటల నుంచి ఈస్టర్ వేడుకలు కన్నుల పండువగా ప్రారంభమయ్యాయి. గుడ్ ఫ్రైడే రోజు శిలువపై అసువులు బాసిన యేసు ప్రభువు మూడో రోజున సమాధి నుంచి భక్తులకు దర్శనమిస్తాడు. కాళ్లు, చేతులకు కొట్టిన మేకుల గాయాలను చూసి గుర్తెరిగి యేసయ్య లేచి వచ్చాడని ప్రజలు ఆనందోత్సాహాలతో ఉప్పొంగి పోతారు.
త్వరలో ఈ లోకానికి వస్తా.. అప్పటి వరకు నేనున్నాని తెలియజేయండి అని వెళ్లి పోతాడు. దీనినే క్రైస్తవులు ఈస్టర్ (పునరుత్థాన పండుగ) పండుగగా జరుపుకుంటారు. ఈస్టర్ను పురస్కరించుకుని మెదక్ డయాసిస్ పరిధిలోని జిల్లాల నుంచే గాకుండా రాష్ట్ర నలుమూలల నుంచి, ఆంధ్ర, కర్నాటక రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు తరలి రావడంతో చర్చి ప్రాంగణమంతా కిక్కిరిసి పోయింది.
సిలువ ఊరేగింపుతో ప్రారంభమైన ఈస్టర్ వేడుకలు..
మెదక్ చర్చి ప్రెసిబేటరీ ఇన్చార్జి రెవరెండ్ ప్రేమ్సుకుమార్ ఆధ్వర్యంలో ఉదయం నాలుగున్నర గంటలకు సిలువ ఉరేగింపుతో ఈస్టర్ వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈస్టర్ పురస్కరించుకుని ఏర్పాటు చేసిన సిలువకు మహిళలు పెద్ద ఎత్తున కొవ్వొత్తులు వెలిగించి స్మరించుకున్నారు.
ఆరాధన దైవం, ప్రత్యేక ప్రార్థనలతో చర్చి ప్రాంగణం హోరెత్తింది. చర్చి గురువుల భక్తి సూక్తుల మధ్య భక్తి గీతాలు ఆలపించారు. ఈ వేడుకల్లో చర్చి ఫాస్టర్లు, రాజశేఖర్, దయానంద్, జైపాల్, రిచర్డ్స్ చర్చి కమిటీ సభ్యులు శాంతికుమార్, రోలండ్పాల్, సునిల్, గెలెన్, సాలోమాన్, ఉదయ్కిరణ్, సువన్డగ్లస్, సంశాన్సందీప్, సుశీల్కుమార్, వసతి గృహాల మేనేజర్ జాయ్ముర్రే తదితరులు పాల్గొన్నారు.