మహదేవపూర్, ఫిబ్రవరి 19: కాళేశ్వరం ప్రాజెక్ట్ పరిధిలోని మేడిగడ్డ బరాజ్లో మట్టి కరకట్ట పనులు నత్తనడకన సాగుతున్నాయి. అన్నారం బరాజ్లో గేట్లు ఎత్తడంతో గత రెండ్రోజుల నుంచి మేడిగడ్డ బరాజ్కు భారీగా వరద పోటెత్తిన విషయం తెలిసిందే. అధికారులు ముందస్తు చర్యలు చేపట్టకపోవడంతో ఆ నీరు ఏడవ బ్లాక్లో కుంగిన పియర్ వద్దకు చేరింది. కాగా, సోమవారం అన్నారం బరాజ్ నుంచి వరద తగ్గుముఖం పట్టింది.
ఆ తర్వాత మేడిగడ్డ బరాజ్ వద్ద పనుల్లో హడావుడి మొదలైంది. ‘చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు’గా అధికారులు ఇప్పుడు ఏడవ బ్లాక్ వైపు వరద రాకుండా నిరోధించేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా కుంగిన పియర్ చుట్టూ కాకుండా బరాజ్కు సమాంతరంగా మట్టితో కరకట్ట ఏర్పాటు చేస్తుండటం అందరినీ ఆశ్చర్యపరుస్తున్నది. కుంగిన పియర్ల చుట్టూ ఇప్పటికే చేరిన వరద నీటిని పక్కకు మళ్లించకపోవడం అధికారుల అలసత్వాన్ని చాటుతున్నది. దీనిపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.