హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ): మునుగోడు ఉపపోరులో అంచనాలకు మించి పోలింగ్ నమోదైంది. సాయంత్రం 6 గంటల వరకు క్యూలైన్లలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించగా, కొన్ని కేంద్రాల్లో అర్ధరాత్రి వరకు ఓపికగా నిలబడి ఓటేశారు. 2014లో జరిగిన సాధారణ ఎన్నికల్లో 81.37 శాతం, 2018లో 91.07 శాతం ఓటింగ్ నమోదైంది. ఈ ఉపఎన్నికలో 93.13 శాతానికి పెరిగింది. నియోజకవర్గంలో మొత్తం 2,41,805 మంది ఓటర్లు ఉండగా 2,25,192 మంది ఓటేశారు. 1,21,672 మంది పురుషులకు 1,13,853 మంది, 1,20,126 మంది మహిళలకు 1,11,338 మంది ఓటు హక్కు వినియోగించుకొన్నారు. నారాయణపురం అత్యధికం..
అన్ని గ్రామాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఓటర్లు బారులు తీరారు. అత్యధికంగా సంస్థాన్నారాయణపురం మండలంలో 93.76 శాతం, అత్యల్పంగా మర్రిగూడ మండలంలో 91.41 శాతం ఓటింగ్ జరిగింది. గ్రామాలతో పోల్చితే పట్టణ ప్రాంతాల్లో తక్కువగా ఓట్లు పోలయ్యాయి. చండూరు మున్సిపాలిటీలో 68.22 శాతం, చౌటుప్పల్ మున్సిపాలిటీలో 73.80 శాతం నమోదైంది.