TS EAPCET | హైదరాబాద్, జనవరి 25 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో 2024,25 విద్యాసంవత్సరానికి ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్ ఎప్సెట్ (TS EAPCET) పరీక్షాతేదీలు ఖరారయ్యాయి. ఈ పరీక్షలను మే 9 నుంచి 13 వరకు నిర్వహిస్తారు. ఈ ప్రవేశ పరీక్షను ఇదివరకు టీఎస్ ఎంసెట్గా పిలిచేవారు. ఇకనుంచి టీఎస్ ఎప్సెట్గా మారుస్తూ ప్రభుత్వం గురువారం జీవో జారీ చేసింది. విభాగాల వారీగా తీసుకొంటే మే 9 నుంచి 11 వరకు ఇంజినీరింగ్, మే 12, 13 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మా విభాగం విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తారు.
ప్రవేశ పరీక్షల నిర్వహణ బాధ్యతలను మరోసారి జేఎన్టీయూహెచ్కే అప్పగించారు. నిరుడు అగ్రికల్చర్, ఫార్మసీ విభాగానికి ముందుగా పరీక్షలు జరగ్గా, ఈ ఏడాది ఇంజినీరింగ్తో ఎప్సెట్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఎప్సెట్ సహా రాష్ట్రంలో నిర్వహించే ఏడు ప్రవేశ పరీక్షల తేదీలను, నిర్వహించే వర్సిటీల వివరాలను ఉన్నత విద్యామండలి ఖరారు చేసింది. విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం, ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి, వర్సిటీల వీసీలు గురువారం ఆయా వివరాలను విడుదల చేశారు.
ఈ ఏడాది ప్రవేశ పరీక్షలు (సెట్స్) టీఎస్ ఈసెట్తో ప్రారంభంకానున్నాయి. ఈ ప్రవేశ పరీక్షను మే 6న నిర్వహించనుండగా, నిర్వహణ బాధ్యతలను ఉస్మానియా వర్సిటీకి అప్పగించారు. జూన్ 10 నుంచి 13 వరకు పీఈసెట్ పరీక్షలు జరుగుతాయి. ఎడ్సెట్ మే 23, లాసెట్ జూన్ 3, ఐసెట్ జూన్ 4, 5 తేదీల్లో, పీజీఈసెట్ను జూన్ 6 నుంచి 8 వరకు నిర్వహిస్తారు. ఇక ప్రవేశ పరీక్షల నిర్వహణ బాధ్యతలను నిరుడు నిర్వహించిన వర్సిటీలకే తిరిగి అప్పగించారు. అయితే ఒకరిద్దరు కన్వీనర్లు మారే అవకాశం ఉన్నది. రెండు రోజుల్లో ప్రవేశ పరీక్షల కన్వీనర్ల పేర్లను ప్రకటించనున్నారు. పరీక్షలను మే నెలలోనే పూర్తిచేయాలని భావించినా అదే సమయంలో టీసీఎస్ సంస్థ ఇతర పరీక్షలను ఆన్లైన్లో నిర్వహిస్తుండటంతో జూన్ రెండో వారం వరకు వెళ్లాయి. ఇక ఎప్సెట్ నోటిఫికేషన్ను ఫిబ్రవరి రెండోవారంలో విడుదల చేసే అవకాశం ఉన్నది.
ఒక్క ఫిజికల్ ఎడ్యుకేషన్ సెట్ (పీఈసెట్) మినహా అన్ని ప్రవేశపరీక్షలను ఆన్లైన్లో నిర్వహిస్తారు. అయితే ఈ సారి పరీక్షలను తక్కువ సెషన్లలో, త్వరగా పూర్తిచేసేందుకు పలు చర్యలు చేపట్టారు. ఇందులోభాగంగా పరీక్షాకేంద్రాలు, సెంటర్ల సామర్థ్యాన్ని గణనీయంంగా పెంచారు. గతంలో ఒక సెషన్లో 25వేల మందికి మాత్రమే పరీక్షలను నిర్వహించే అవకాశముండగా, ఈ సామర్థ్యాన్ని రోజుకు 35వేల మందికి పెంచారు. దీంతో పరీక్షలు త్వరగా పూర్తికానున్నాయి.
పీఈసెట్, పీజీఈసెట్లో పలు మార్పుల చేసేందుకు ఉన్నత విద్యామండలి కమిటీలను నియమించింది. పీఈసెట్లో లాంగ్, జంప్, హైజంప్, వెయ్యి మీటర్ల పరుగులను తొలగించాలని, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ద్వారానే అడ్మిషన్లు కల్పించాలని ఈ కమిటీ సిఫారసు చేసింది. ఇక పీజీఈసెట్లో తక్కువ మంది దరఖాస్తు చేసుకొన్న సబ్జెక్టులకు ప్రవేశపరీక్షల్లేకుండా ప్రత్యామ్నాయ పద్ధతుల్లో అడ్మిషన్లు నిర్వహించేందుకు మరో కమిటీని నియమించారు. ఆయా సెట్ కమిటీ సమావేశాల్లో ఈ అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. వీటిపై తది నిర్ణయం తీసుకొని, ఆయా విషయాలను నోటిఫికేషన్లో పొందుపరుస్తామని అధికారులు తెలిపారు.
ప్రవేశ పరీక్షల షెడ్యూళ్లను ఖరారు సందర్భంగా ప్రభుత్వం వర్సిటీల వీసీలకు గట్టి హెచ్చరికలు జారీచేసింది. ఎలాంటివి జరిగినా అందుకు వర్సిటీల వైస్చాన్స్లర్లదే బాధ్యత అని విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం హెచ్చరించారు. ఈ సందర్భంగా జేఎన్టీయూ, ఉస్మానియా, కాకతీయ వర్సిటీల వీసీలతో గురువారం హైదరాబాద్ మాసబ్ట్యాంక్లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో సమావేశమయ్యారు. ప్రవేశ పరీక్షల నిర్వహణ సందర్భంగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పరీక్షల్లో.. ప్రశ్నపత్రాల్లో.. ఫలితాల వెల్లడిలో తప్పులు జరుగవద్దని స్పష్టంచేశారు.
– బుర్రా వెంకటేశం