పెద్దఅంబర్పేట, జూన్ 2: రేషన్ దుకాణాల పేరెత్తితో జనం విసిగిపోతున్నారు. సన్న బియ్యం కోసం గంటల తరబడి నిలబెడుతున్నారని మండిపడుతున్నారు. తెల్లవారగానే.. సంచులు పట్టుకుని బారులు తీరాల్సిన పరిస్థితి నెలకొన్నదని భగ్గుమంటున్నారు. పనులు మానుకుని బియ్యం కోసం వేచి చూడాల్సిన పరిస్థితులు వచ్చాయని అసహనం వ్యక్తంచేస్తున్నారు. సాధారణంగా రేషన్ దుకాణాల వద్ద బియ్యం తీసుకునేందుకు అరగంట వరకు పట్టేదని, ఇప్పుడు గంటల తరబడి లైన్లలో నిలబడాల్సి వస్తున్నదని ఆగ్రహంగా చెప్తున్నారు.
ఒక్కో నెల బియ్యం కోసం రెండేసి సార్లు వేలిముద్ర (థంబ్) వేయాల్సి వస్తున్నదని, మొత్తం మూడు నెలల బియ్యానికి ఆరుసార్లు థంబ్ పెట్టాల్సి వస్తున్నదని విసుగు చెందుతున్నారు. లైన్లో తమవంతు వచ్చాక తక్కువలో తక్కువ అరగంట సమయం తీసుకుంటున్నదని చెప్తున్నారు. సర్వర్ సరిగా పనిచేయక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, అన్నీ కలిపి ఒకే స్లిప్పుగా ఇస్తే కొంచెమైనా ఇబ్బందులు తగ్గుతాయని అంటున్నారు.
ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మూడు నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ఒకేసారి ఇస్తుండటం లబ్ధిదారులకు కొత్త కష్టాలు తెచ్చిపెట్టింది. గత నెల వరకు రేషన్ కోసం వెళ్తే.. బయట లైన్లో 15 నిమిషాలు నిలబడితే సరిపోయేది. నేరుగా సర్వర్ చెంతకు వచ్చేవారు. అక్కడ సర్వర్ మెషిన్లో ఒకసారి వేలిముద్రలు పెట్టి.. వచ్చే కోటా బియ్యాన్ని అదే సమయంలో తూకం చేసి ఇచ్చేసేవారు. కానీ, మూడునెలల బియ్యం ఒకేసారి ఇస్తుండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒక్కో నెల కోటా బియ్యానికి ఒక్కోసారి తూకం వేయాల్సి వస్తున్నది. ఒక్కోనెల బియ్యంలోనూ కేంద్రం ఇచ్చే బియ్యానికి ఒకసారి, రాష్ట్ర కోటా బియ్యానికి మరోసారి వేలి ముద్ర వేయిస్తున్నారు. ఇలా మూడునెలలకు కలిపి ఆరుసార్లు వేలిముద్రలు వేస్తున్నారు. ఆయా కోటాల ప్రకారం ఆరుసార్లు బియ్యం తూకం చేస్తున్నారు.
ఇది లబ్ధిదారులకు ఇబ్బందులు తెచ్చిపెడుతున్నది. ఒకేసారి మూడునెలల బియ్యం ఇస్తుండటంతో జనం రద్దీ పెరిగింది. రేషన్ దుకాణాల వద్ద బారులు పెరిగాయి. బయటే గంటల తరబడి నిలబడాల్సిన పరిస్థితి నెలకొన్నది. పొద్దున్నే లైన్లో 40 మంది నిలబడితే 25 మంది కోటా పూర్తయ్యేసరికే సమయం గడిచిపోతున్నది. సాయంత్రం మళ్లీ కొత్తగా మొదటి నుంచి లైన్లో వేచి చూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇది ఎక్కువ సమయాన్ని తీసుకుంటున్నదని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
గత నెల వరకు 12 కిలోల బియ్యం తీసుకున్నందుకు రేషన్ దుకాణాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఒకే స్లిప్ వచ్చేది. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. ప్రతినెలా బియ్యానికి కేంద్రం స్లిప్పు ఒకటి, రాష్ట్రం స్లిప్పు మరోటి ఇస్తున్నారు. నెలకు రెండు స్లిప్పుల చొప్పున మూడు నెలల బియ్యానికి కలిపి ఒక్కో లబ్ధిదారుకు 6 స్లిప్పులు ఇస్తున్నారు. అంటే ఒక వ్యక్తి 36 కిలోల బియ్యం తీసుకుంటే కేంద్రానికి సంబంధించిన ప్రతి 10 కిలోలకు ఒక స్లిప్పు చొప్పున మూడు స్లిప్పులు, రాష్ట్ర వాటా ప్రతి 2 కిలోలకు ఒకటి చొప్పున మూడు స్లిప్పులు, ఇలా మొత్తం కలిసి ఒక్కో లబ్ధిదారు ఆరు స్లిప్పులు వచ్చేవరకు వేచి చూడాల్సిందే.
ఆరుసార్లు వేలిముద్రలు వేయాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఇలా ఆరు స్లిప్పులు వచ్చేందుకు సర్వర్ దాదాపు 30 నిమిషాల సమయం తీసుకుంటున్నది. ఈ లెక్కన ఒక్కో దుకాణంలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు దాదాపు 30 మందికి, సాయంత్రం నుంచి రాత్రి వరకు మరో 30 మందికి మాత్రమే బియ్యం అందించే అవకాశం ఉంటున్నది. అంటే రోజుకు దాదాపు 60 మంది. రేషన్ దుకాణంలో 2 వేల కార్డులు ఉన్నాయనుకుంటే.. చివరి వ్యక్తి బియ్యం పొందేందుకు నెల రోజుల సమయం పట్టే అవకాశం ఉన్నది.