Dy CM Mallu Batti Vikramarka | డ్రగ్స్ రహిత తెలంగాణ సమాజమే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. మాదక ద్రవ్యాల రవాణాలో ఎంతటి పెద్దవారు ఉన్న ఉపేక్షించబోమని, ఉక్కుపాదంతో తమ ప్రభుత్వం అణచివేస్తుందన్నారు. డ్రగ్స్ రవాణా చేసే అక్రమార్కుల గుండెల్లో రైల్లు పరుగేత్తించేలా తమ ప్రభుత్వం నిర్ణయాలు ఉండబోతాయన్నారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మంగళవారం హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో కలిసి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క యాంటీ డ్రగ్ అవేర్నెస్ సాంగ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ తెలంగాణలో ఏర్పడిన ఇందిరమ్మ రాజ్యంలో మాదక ద్రవ్యాలు, అక్రమ రవాణా అనే మాట వినబడటానికి వీలులేదని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుందన్నారు. డ్రగ్స్ రహిత తెలంగాణ లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్టు వివరించారు.
నిర్ధేశిత లక్ష్యానికి అనుగుణంగా రాష్ట్రంలో అక్రమ రవాణా, డ్రగ్స్ నివారణకు ఎన్ని నిధులైనా పోలీస్ శాఖకు కేటాయించడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. నేటి పిల్లలే రేపటి భవిష్యత్ అని ఈ ప్రభుత్వం భావిస్తున్నందున డ్రగ్స్ నివారణకు తమ ప్రభుత్వానికి బడ్జెట్ సమస్యే కాదన్నారు. తక్కువ సమయంలో అక్రమ పద్దతిలో ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదించాలన్న దురుద్దేశ్యంలో కొంత మంది దుర్మార్గులు యువతను డ్రగ్స్కు అలవాటు చేస్తున్నారన్నారు. దేశంలో బలీయంగా ఉన్న మానవవనరులను నిర్వీర్యం చేసి దేశాన్ని బలహీన పర్చాలన్న కుట్రలో భాగంగా దేశ ద్రోహులు సైతం డ్రగ్స్ను రవాణా చేస్తున్నారని ఇలాంటి వారి ఉచ్చులో పడి యువత తమ బంగారు భవిష్యత్తును కోల్పోవద్దని సూచించారు.
దేశ భవిష్యత్తుకు ఉపయోగపడే యువతను నిర్వీర్యం చేస్తున్న డ్రగ్సును సమూలంగా నివారించడం ప్రభుత్వం, పోలీసులతో పాటు మనందరి బాధ్యత అని మల్లు భట్టి విక్రమార్క అన్నారు. పోలీసులు వేసే ప్రతి అడుగు మన రక్షణ కోసమే అన్న విషయాన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకొని పోలీసులకు సహకరించాలని కోరారు. తెలంగాణ పోలీస్ వ్యవస్థ చాలా బలమైనది, తెలివైనదని, ఎంత దూరం వెళ్ళైన నిందితులను పట్టుకునే శక్తి సామర్థ్యాలు తెలంగాణ పోలీసులకు ఉన్నాయని అన్నారు.
నగరాలకి కాకుండా గ్రామాలకు విస్తరిస్తున్న మాదకద్రవ్యాల నివారణకు అన్ని గ్రామాల్లో కమిటీలు వేసి పోలీసులు సమాచార వ్యవస్థను బలోపేతం చేసుకుంటే కట్టడి చేయడం సులభం అవుతుందని మల్లు భట్టి విక్రమార్క్ సూచించారు. ప్రశాంతంగా ఆప్యాయంగా ప్రేమగా ఉన్న కుటుంబ వ్యవస్థలో డ్రగ్స్ విష ప్రయోగం లాంటిదన్న సంగతిని విద్యార్థులు గ్రహించాలన్నారు.
ప్రపంచంతో పోటీపడే విధంగా విద్యార్థులు ఎదగడానికి ఈ ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తున్నదని వివరించారు ప్రభుత్వానికి పన్నుల నుంచి వస్తున్న ప్రతి పైసను సద్వినియోగం చేస్తూ విద్యకు ఎక్కువ మొత్తంలో వెచ్చించి పిల్లల బంగారు భవిష్యత్తుకు తోడ్పడుతున్నామన్నారు. తాత్కాలిక వ్యసనాలకు బానిసలుగా మారితే మీ తల్లిదండ్రులతో పాటు ఈ సమాజం బాధపడుతుందన్న విషయాన్ని మర్చిపోవద్దని అన్నారు. విద్యార్థులు, యువత మంచి సహవాసంతో నడిచి భవిష్యత్తును మార్గదర్శనం చేసుకోవాలని కోరారు. కార్యక్రమం అనంతరం నెక్లెస్ రోడ్డుపై విద్యార్థుల ర్యాలీని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క జండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీజీపీ రవి గుప్తా, యాంటీ నార్కోటిక్స్ డైరెక్టర్ సందీప్ శాండిల్య, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.