హైదరాబాద్ సిటీబ్యూరో/బండ్లగూడ, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ): కొత్త సంవత్సరం వేడుకల వేళ నగరంలో డ్రగ్స్ పట్టివేత కలకలం రేపింది. రాజేంద్రనగర్ పరిధిలో డ్రగ్స్ అమ్మడానికి యత్నిస్తున్న యువతితో పాటు ఇద్దరు యువకులను అరెస్టు చేసి రిమాండ్ తరలించారు. రాజేంద్రనగర్ ఇన్స్పెక్టర్ నాగేంద్రబాబు వివరాల ప్రకారం.. శివరాంపల్లిలోని పిల్లర్ నంబర్ 290 వద్ద ఉన్న కెన్వర్ట్ అపార్ట్మెంట్లో ఉంటున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి సంధ్య (26) వద్దకు డ్రగ్స్ కొనేందుకు కేరళకు చెందిన డేవిడ్, అర్జున్ రాగా, పక్కా సమాచారం మేరకు బాలానగర్, రాజేంద్రనగర్ ఎస్వోటీ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి రూ.2 లక్షల విలువ చేసే 7.5 గ్రాముల డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని రిమాండ్కు తరలించారు. నూతన సంవత్సర వేడుకల్లో డ్రగ్స్ను అమ్మేందుకు బెంగళూరు నుంచి డ్రగ్స్ తీసుకొచ్చినట్టు పోలీసులు తెలిపారు.
న్యూఇయర్ వేడుకలకు డ్రగ్స్ సరఫరాకు ప్రయత్నిస్తున్న ఇద్దరిని వెస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశామని డీసీపీ శ్రీబాల తెలిపారు. ఏపీలోని గుంటూరుకు చెందిన సురిలీల నవీన్సాయి, ఒంగోలుకు చెందిన బొర్రవీర సాయితేజ హైదరాబాద్లోని పుప్పాలగూడలో ఉంటున్నారు. ఢిల్లీలోని డ్రగ్ ప్లెడ్లర్ నుంచి డ్రగ్, కొకైన్, బ్రౌన్ షుగర్ కొనుగోలు చేసి విక్రయించేందుకు ప్లాన్ చేశారు. జూబ్లీహిల్స్లోని ఓ లిక్కర్ మార్ట్ వద్ద కస్టమర్ల కోసం ఎదురు చూస్తున్నారు. విశ్వసనీయ సమాచారంతో ఇన్స్పెక్టర్ ఖలీల్పాషా నేతృత్వంలోని బృందం ఇద్దరిని అరెస్ట్ చేసి, వారి నుంచి 100 గ్రాముల ఎండీఎంఏ, 11.6 గ్రాముల బ్రౌన్ షుగర్, రెండు గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణకు కేసును జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించారు.
రాజస్థాన్ నుంచి హైదరాబాద్కు డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్న ముగ్గురిని ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారని డీసీపీ మురళీధర్ తెలిపారు. యూపీకి చెందిన ఉమేశ్ తివారి, రాజస్థాన్కు చెందిన సురేశ్ దేవాసి, రావల్ల రామ్ మీర్పేట్ ఠాణా పరిధిలో డ్రగ్ విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. 15 గ్రాముల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు.