నమస్తే తెలంగాణ నెట్వర్క్, సెప్టెంబర్ 18 : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో జూరాల ప్రాజెక్టుకు వరద స్వల్పంగా పెరిగింది. ఆదివారం సాయంత్రానికి 2.08 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదు కాగా డ్యాం 36 గేట్ల నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అవుట్ఫ్లో 1,95,365 క్యూసెక్కులుగా ఉన్నది. కర్ణాటకలోని తుంగభద్ర జలాశయానికి వరద తగ్గుముఖం పట్టడంతో డ్యాం గేట్లను మూసేశారు. ఇన్ఫ్లో 24,525 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 18,338 క్యూసెక్కులుగా నమోదైంది. ఆర్డీఎస్ ఆనకట్టకు ఇన్ఫ్లో 43,627 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 43,100 క్యూసెక్కులుగా ఉన్నది. శ్రీశైలం 10 గేట్ల నుంచి నీటి విడుదల కొనసాగుతున్నది. ఇన్ఫ్లో 2,13,004 క్యూసెక్కులుగా నమోదైంది.
నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు ఆదివారం 1,62,759 క్యూసెక్కుల ఇన్ఫ్లో రాగా ప్రాజెక్టు నుంచి 2,01,815 క్యూసెక్కుల అవుట్ఫ్లో కొనసాగుతున్నది. డ్యాం 8 క్రస్ట్ గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 1,17,248 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఎస్సారెస్పీలోకి 80,570 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతున్నది. దీంతో 19 వరద గేట్లు ఎత్తి గోదావరిలోకి 71,750 క్యూసెక్కుల మిగులు జలాలను విడుదల చేస్తున్నారు.