రాష్ట్రంలో కరువొచ్చింది. మళ్లీ రైతుల ఆత్మహత్యలు మొదలయ్యాయి. అన్నదాతలకు ప్రభుత్వం అండగా ఉండాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కోరితే.. ఆత్మహత్య చేసుకున్న రైతుల వివరాలివ్వాలని సీఎం రేవంత్ సూచించారు. ముఖ్యమంత్రి అడిగిన నాలుగు గంటల్లోనే.. గత మూడునెలల్లో బలవన్మరణానికి పాల్పడిన 200మంది రైతుల జాబితాను సామాజిక మాధ్యమాల ద్వారా అందించినట్టు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.
ఆ జాబితా పంపిన కొద్దిగంటలకే.. మంత్రి ఉత్తమ్ విస్మయకర వ్యాఖ్యలు చేశారు. అసలు రాష్ట్రంలో ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోలేదని చెప్పారు. తాజాగా మంత్రి కోమటిరెడ్డి కూడా అలాంటి మాటలే మాట్లాడారు. అప్పుల కారణంగా, కరువు కారణంగా ఒక్కరైతు కూడా ఆత్మహత్య చేసుకోలేదన్నారు. ఇదీ ప్రభుత్వ పెద్దల మాట! నిజాలను గుర్తించడానికి నిరాకరిస్తున్న తీరు!
ఈ నేపథ్యంలో వాస్తవపరిస్థితిని వివరించేందుకు అక్షర సాక్ష్యాలుగా రైతు ఆత్మహత్యలపై కొన్ని కేస్స్టడీస్ నేటినుంచి..
Farmers | కన్నాయిగూడెం, ఏప్రిల్ 7 : ధారగా కారుతున్న కన్నీళ్లతో కొడుకు ఫొటో వద్ద దిగాలుగా నిల్చున్న ఈ అవ్వ పేరు అగ్గు అనసూయ. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం గుర్రేవుల ఈమె పుట్టినూరు. ఈమెకు 35 ఏండ్లక్రితం భూపాలపల్లి జిల్లా పలిమెల మండలం లెంకలగడ్డ గ్రామానికి చెందిన మల్లయ్యతో లగ్గం చేసిండ్రు. లెంకలగడ్డలో మూడెకరాలతో భూమిని నమ్ముకుని ఎవుసం మొదలుపెట్టిన ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. ఒక కొడుకు, ఒక కూతురుతో హాయిగా సాగుతున్న వీరి సంసారంలో పెట్టుబడికి చేసిన అప్పులు నిప్పులు పోశాయి. కొడుకుకు పదేండ్ల వయస్సునప్పుడు అప్పులు పెరిగి తండ్రి మల్లయ్య ఆత్మహత్య చేసుకున్నాడని అగ్గు అనసూయ బోరున విలపిస్తూ చెప్పింది. అత్తగారి ఊరు అయిన లెంకలగడ్డలో ఉండలేక తల్లిగారి ఊరు అయిన గుర్రేవులకు వచ్చి కూలి పనులు చేసి కొడుకును, బిడ్డను పెంచి పెద్ద చేశానని తెలిపింది. బిడ్డ పెండ్లీ చేసిన తర్వాత కొడుకుతో కలిసి గుర్రేవులలోనే తాను కూలి పని, కొడుకు ట్రాక్టర్ డ్రైవర్గా పని చేసుకుంటూ జీవిస్తున్నామని చెప్పింది.
నాలుగేండ్ల నుంచి కాలం కలిసి రావడంతో కొడుకు మధు లెంకలగడ్డలో ఉన్న భూమిని కౌలుకిచ్చి, గుర్రేవులలో భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం మొదలుపెట్టాడని చెప్పింది. నిరుడు గుర్రేవులకు చెందిన తడుకల మల్లయ్యకు చెందిన ఎకరంన్నర పొలాన్ని కౌలుకు తీసుకొని మిర్చి పంట సాగు చేస్తే.. రెండు లక్షల అప్పు అయిందని తెలిపారు. మిర్చి దిగుబడి రాలేదని, అప్పు ఎట్లా కట్టాలని బంధువులు, స్నేహితులతో తన బాధ చెప్పుకుంటూ మధుకర్ మదనపడ్డాడని అనసూయ వివరించారు. ఫిబ్రవరి 9వ తేదిన ఉదయం బంధువులకు ఫోన్ చేసి తాను బతకదల్చుకోలేదని, అప్పుల బాధతో పురుగుల మందు తాగి చనిపోతున్నానని చెప్పాడని, అదే నా కొడుకు ఆఖరి మాటని ఆమె భోరున విలపించింది.
బంధువులు తెలిపిన సమాచారంతో గ్రామస్తుల సహకారంతో చుట్టు పక్కల వెతుకుతుండగా గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో పురుగుల మందు తాగి స్పృహ లేనిస్థితిలో కొడుకు కనిపించాడని చెప్పింది. అంబులెన్సులో ఏటూరునాగారం దవాఖానకు తరలిస్తుండగా రొయ్యూరు గ్రామానికి చేరుకునే సరికి ప్రాణం విడిచాడని రోదిస్తూ వివరించింది. కట్టుకున్న మొగుడు ఆగం చేస్తే.. కంటికి రెప్పలా కాపాడుకున్న కొడుకు సాకుతడని కలలు కన్నానని… కానీ అప్పుల బాధకు కండ్ల ముందే దూరమయ్యాడని కన్నీటి పర్యంతమైంది. చెట్టంత కొడుకు దూరమయ్యాక తనకు దిక్కెవరని గుండెలు బాదుకున్నది.
రెక్కల కష్టంతో ఎవుసం చేసుకుంటున్న ఆ కుటుంబాన్ని పెట్టుబడికి చేసిన అప్పు కట్లపామై కాటేసింది. సమైక్యపాలనలో సాగునీటి కష్టాల నడుమ కన్నీటి సేద్యం చేసిన ఆ కుటుంబ పెద్ద… 20 ఏండ్ల క్రితం ఆత్మహత్య చేసుకున్నడు. ఇద్దరు చిన్నపిల్లలను వెంటబెట్టుకుని పుట్టింటికి వచ్చిన అగ్గు అనసూయనూ అవే కష్టాలు వెంబడించాయి. కూలీనాలీ చేసుకుంటూ బిడ్డ పెండ్లి చేసిన ఆ తల్లికి చెట్టంత ఎదిగిన కొడుకు మధుకర్ చేతికొచ్చిండని సంబురపడ్డది. మళ్లీ ఎవుసంలోకి దిగిన కొడుకునూ పెట్టుబడి కష్టాలు వెంటాడాయి. కౌలుకు తీసుకుని చేసిన పొలంలో దిగుబడి కరువైంది. అప్పులు తీర్చే మార్గం కానరాక పురుగుమందు తాగి ప్రాణం తీసుకున్నడు. నాడు భర్త.. నేడు కొడుకు అప్పులకే బలవడంతో అనసూయ అనాథగా మారింది.
20 ఏండ్ల క్రితం భర్త, ఇప్పుడు కొడుకు మరణంతో పుట్టెడు దుఖంలో ఉన్న అగ్గు అనసూయను ఓదార్చేవారే కరువయ్యారు. సోదరుడు, తల్లితో కలిసి ఉంటున్న ఆమె నిలువనీడ లేక అనాథగా మిగిలిపోయింది. మధుకర్ మృతి చెందిన అనంతరం వారి కుటుంబ సభ్యులను ఇటు ప్రజాప్రతినిధులు కానీ, అటు అధికారులు కానీ కనీసం పలుకరించలేదు. వారి వివరాలు తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. దహన సంస్కారాల సమయంలో గ్రామానికి చెందిన కొందరు నాయకులు 50 కేజీల బియ్యం, రూ.2500 నగదును మాత్రం అందజేశారని అనసూయ తెలిపింది. ప్రస్తుతం లెంకలగడ్డ గ్రామంలో సర్వే నంబర్ 7/4లో 2ఎకరాల పట్టా భూమి మధుకర్ పేరుపై ఉందని, రైతు బంధు పైసలు కూడా ఇటీవల పడ్డాయని చెప్పింది. మరణ ధ్రువీకరణ పత్రం వచ్చిన అనంతరం రైతు భీమాకు దరఖాస్తు చేసుకుంటానని చెప్పింది. రైతు బీమా సాయం అందించడంలో అధికారులు సహకారం అందించాలని కోరుతున్నది.