సంగారెడ్డి, మే 15(నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ పార్టీయే రైతులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో ధర్నాలు చేయిస్తున్నదని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ఆరోపించారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం తొగర్పల్లిలో కేజీఎస్ పరిశ్రమకు మంత్రులు శ్రీధర్బాబు, దామోదర రాజనరసింహ శంకుస్థాపన చేశారు. అనంతరం సంగారెడ్డిలో టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలారెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాష్ట్రంలో ధాన్యం సేకరణలో ఎక్కడా సమస్యలు లేవని.. ఎక్కడైనా ఒక్క లారీ రాకపోతే దాన్నే అదనుగా తీసుకుని బీఆర్ఎస్ రాజకీయలబ్ధి పొందేందుకు పార్టీ కార్యకర్తలు, రైతులతో ధర్నాలు చేయిస్తున్నదని తెలిపారు. ఐటీశాఖ నుంచి వీశాట్ను తనకు తెలియకుండా విద్యాశాఖకు అప్పగించడంపై స్పందిస్తూ.. క్యాబినెట్లో చర్చించాకే వీశాట్ మార్పుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.