Dubbak | సిద్దిపేట/ఆదిలాబాద్/కేపీహెచ్బీ కాలనీ/ఇబ్రహీంపట్నంరూరల్, అక్టోబర్ 31( నమస్తే తెలంగాణ ప్రతినిధి): సిద్దిపేట జిల్లా దుబ్బాక కాంగ్రెస్లో ముసలం మొదలైంది. చెరుకు శ్రీనివాస్రెడ్డికి టికెట్ కేటాయించడాన్ని నిరసిస్తూ మంగళవారం నియోజకవర్గంలోని సీనియర్ నేతలు రహస్యంగా సమావేశమైనట్టు తెలుస్తున్నది. తొగుట, రాయపోల్ మండలాల మధ్య ఓ తోటలో సమావేశమై భవిష్యత్తు కార్యచరణపై చర్చించినట్లు సమాచారం.
శ్రీనివాస్రెడ్డి పార్టీ ప్రయోజనాల కోసం కాకుండా స్వప్రయోజనాల కోసం పనిచేస్తారని ఆరోపించారు. ఇలాంటి వ్యక్తి గెలిచినా పార్టీలో ఉంటాడన్న నమ్మకం లేదని పేర్కొన్నారు. సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు ప్రభాకర్రెడ్డి, కిష్టారెడ్డి, చెరుకు కొండల్రెడ్డి,రాజిరెడ్డి, పెంటారెడ్డి, కర్నాల శ్రీనివాస్, బొమ్మెర శ్రీధర్, తదితరులు పాల్గొన్నారని సమాచారం.
దొంగల ముఠాలా పీసీసీ నేతలు
పీసీసీ నేతలు దొంగల ముఠాగా మారి.. టికెట్లు అమ్ముకున్నారని కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కూకట్పల్లి నియోజకవర్గ నేత గొట్టిముక్కల వెంగళరావు ఆరోపించారు. రేవంత్రెడ్డి కోసం ఆదిలాబాద్లో నిర్వహించిన కాంగ్రెస్ సభనుంచి ఇటీవల తుక్కుగూడలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ సమావేశాలకు తనలాంటి ఆశావహులంతా డబ్బులు ఖర్చుపెట్టి నాయకులు, కార్యకర్తలను తరలించి సభలను విజయవంతం చేసినట్టు తెలిపారు.
ఈ ఎన్నికల్లో కూకట్పల్లి, శేరిలింగంపల్లిలో కాంగ్రెస్ పార్టీకి భంగపాటు తప్పదని జోస్యం చెప్పారు. రానున్న ఎన్నికల్లో పార్టీ పెద్ద చెంప ఛెళ్లుమనిపించేందుకు బీఆర్ఎస్ లో చేరతున్నట్టు తెలిపారు. బుధవారం కూకట్పల్లి చిత్తారమయ్య ఆలయం నుంచి వేయిమంది అనుచరులతో ర్యాలీగా వెళ్లి సీం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరనున్నట్టు తెలిపారు.
ఆదిలాబాద్ జిల్లాలో నేతల నిరసనలు
మంగళవారం ఆదిలాబాద్లో నిర్వహించిన నియోజకవర్గ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశానికి సీనియర్లు గైర్హాజరయ్యారు. ఈ సమాశానికి ఆదిలాబాద్ పార్లమెంట్ ఎన్నికల ఏఐసీసీ పరిశీలకుడు, కర్ణాటక ఎమ్మెల్సీ రాథోడ్ ప్రకాశ్ హాజరయ్యారు. టికెట్ ఆశించిన సీనియర్ నాయకులు డీసీసీ అధ్యక్షుడు సాజిద్ఖాన్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత, సీనియర్ నాయకుడు సంజీవ్రెడ్డి, ఇతర నాయకులు, కార్యకర్తలు సమావేశానికి హాజరుకాలేదు.
బోథ్లో పార్టీ అభ్యర్థి వన్నెల ఆశోక్ నిర్వహించిన మోటార్ సైకిల్ ర్యాలీకి టికెట్ ఆశించి భంగపడిన సీనియర్లు నరేశ్ జాదవ్, ఆడే గజేందర్, వారి మద్దతుదారులు గైర్హాజరయ్యారు. ఖానాపూర్ టికెట్ విషయంలో కాంగ్రెస్ అధిష్ఠానం తనకు అన్యాయం చేసిందని ఉట్నూర్ జడ్పీటీసీ చారులత రాథోడ్ మండిపడ్డారు. తనతో పాటు ఆసిఫాబాద్ టికెట్ ఆశించిన సరస్వతికి సైతం రేవంత్రెడ్డి టికెట్ నిరాకరించారని ఆవేదన వ్యక్తం చేశారు.
నిత్యం ప్రజల్లో ఉండే తనకు అన్యాయంచేసి, నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయిన మల్రెడ్డి రంగారెడ్డికి టికెట్ కేటాయించడం బాధగా ఉందని ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ అసమ్మతి నాయకుడు మర్రి నిరంజన్రెడ్డి అన్నారు. మంగళవారం ఇబ్రహీంపట్నంలోని సాయి ఫంక్షన్హాల్లో అనుచరులతో సమావేశమైన ఆయన.. టికెట్ మల్రెడ్డికి కేటాయించినప్పటికీ బీఫాం మాత్రం తనకే వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రెండుమూడు రోజుల్లో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు.