సిద్దిపేట, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డిపై జరిగిన హత్యాయత్నానికి నిరసనగా బీఆర్ఎస్ ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం దుబ్బాకలో బంద్ విజయవంతమైంది. సబ్బండ వర్ణాల ప్రజలు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొని సక్సెస్ చేశారు. ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. దుబ్బాక, మిరుదొడ్డి, భూంపల్లి అక్బర్పేట, తొగుట, రాయపోల్, దౌల్తాబాద్, చేగుంట మండల కేంద్రాలుసహా అన్ని గ్రామాల్లో వ్యాపారులు తమ దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేసి బంద్కు మద్దతు ప్రకటించారు. గ్రామాలు, పట్టణ, మండల కేంద్రాల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ర్యాలీలు నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.
తొమ్మిదేండ్లలో బీఆర్ఎస్ ప్రజారంజక పాలనను చూసి ఓర్వలేక ప్రతిపక్ష పార్టీలు అధికారం కోసం అర్రులు చాచుకొని తెలంగాణలో హింసాయుత వాతావరణాన్ని సృష్టిస్తున్నాయని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. ప్రభాకర్రెడ్డి మీద హత్యాయత్నం ప్రజాస్వామ్యం మీద జరిగిన దాడిగా భావిస్తున్నామని పేర్కొన్నారు. హత్యాయత్నం ఘటనపై లోతుగా దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కత్తిపోట్లకు గురైన కొత్త ప్రభాకర్రెడ్డి త్వరగా కొలుకోవాలని సిద్దిపేట జిల్లావ్యాప్తంగా ప్రధాన ఆలయాల్లో పార్టీ శ్రేణులు ప్రత్యేక పూజలు, మృత్యుంజయ హోమాలు నిర్వహించారు. దుబ్బాక వేంకటేశ్వరాలయం, రాంపూర్ మదనానంద శారదాక్షేత్రంతోపాటు నియోజకవర్గంలోని అన్ని ఆలయాల్లో పూజలు చేశారు. మసీదులు, చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మెదక్లో సీఎస్ఐ చర్చిలో స్థానిక ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ప్రార్థనలు చేశారు. గజ్వేల్, సిద్దిపేట నియోజకవర్గాలతోపాటు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా స్థానిక బీఆర్ఎస్ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.