హైదరాబాద్ సిటీబ్యూరో, మే 6 (నమస్తే తెలంగాణ): మాదక ద్రవ్యాల వాడకం దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్నదని, కేంద్ర, రాష్ట్ర నిఘా, దర్యాప్తు సంస్థల సమన్వయంతో వాటిపై కొరడా ఝళిపిస్తామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. శుక్రవారం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈడీ, ఎన్సీబీ, సీఐఎస్ఎఫ్, కస్టమ్స్, డీఆర్ఐ వంటి ఏజెన్సీలు, పోలీసుల సమన్వయంతో పనిచేస్తున్నామని, అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నివారణ వ్యవస్థలతోనూ అనుసంధానం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. త్వరలోనే ఆయా దర్యాప్తు సంస్థలతో సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. దేశంలో 2014 నుంచి ఇప్పటివరకు 70 శాతం డ్రగ్స్ వాడకందారులు పెరిగారని, దాదాపు 10 కోట్ల మంది మత్తులో జోగుతున్నారని సీపీ ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల హైదరాబాద్ ఎయిర్పోర్టులో రూ.125 కోట్లు విలువైన డ్రగ్స్ పట్టుబడ్డాయని చెప్పారు. 70 శాతం ఓడరేవులు, 20 శాతం రోడ్డురవాణా, 10 శాతం విమానాల ద్వారా డ్రగ్స్ స్మగ్లింగ్ జరుగుతున్నదని వివరించారు. ఓడరేవుల వద్ద పటిష్ట బందోబస్తుకు, అవసరమైన టెక్నాలజీ వినియోగానికి ఆయా సంస్థలు సన్నాహాలు చేస్తున్నాయని అన్నారు.
సంస్థల మధ్య సమన్వయంతో..
సంస్థల మధ్య సమన్వయంతోనే గురువారం నార్కోటిక్ బ్యూరో హైదరాబాద్లో ఒక వ్యాపారి ఇంటిపై దాడి చేసిందని సీపీ గుర్తుచేశారు. అటు.. బంజారాహిల్స్లోని రాడిసన్ బ్లూ హోటల్ నిర్వహిస్తున్న ఫుడింగ్ అండ్ మింక్ పబ్ కేసులో గతంలో అరెస్టయిన అంతర్జాతీయ డ్రగ్ స్మగ్లర్ టోనీ గ్యాంగ్తో సంబంధాలున్న వారిని విచారించామని సీపీ తెలిపారు. పబ్ నిర్వాహకుడు ఉప్పల అభిషేక్, మేనేజర్ అనిల్ కుమార్ను అరెస్ట్ చేశామని, అభిషేక్కు టోనీ గ్యాంగ్తో సంబంధాలున్నాయని అన్నారు. పుడింగ్ పబ్లో దొరికిన కొకైన్, గతంలో టోనీ వద్ద లభించిన కొకైన్ ఒకేలా ఉన్నాయని చెప్పారు. పబ్కు వచ్చిన 148 మందిలో కొందరిపై అనుమానం ఉన్నదని, విచారణ అనంతరం మరిన్ని అరెస్టులు ఉండే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.