కొత్తగూడెం క్రైం, ఫిబ్రవరి 13: కొత్తగూడెం జిల్లా కేంద్రంలో రూ.27 కోట్ల విలువైన 11 టన్నుల మాదక ద్రవ్యాలను ఎస్పీ, డ్రగ్ డిస్పోజల్ కమిటీ జిల్లా చైర్మన్ బిరుదరాజు రోహిత్రాజు పర్యవేక్షణలో మంగళవారం దాహనం చేశారు. జిల్లాలోని 17 పోలీస్స్టేషన్ల పరిధిలో కొద్దిరోజుల నుంచి ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, పోలీసులు వాహన తనిఖీలు చేపట్టి భారీగా మాదక ద్రవ్యాలను పట్టుకున్నారు. కోర్టు ఉత్తర్వులు, ఎస్పీ, డ్రగ్ డిస్పోజల్ కమిటీ జిల్లా చైర్మన్ ఆదేశాల మేరకు హేమచంద్రాపురం జిల్లా పోలీస్ హెడ్క్వార్టర్స్ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు సిబ్బంది మాదక ద్రవ్యాలను పోలీస్ స్టేషన్ల వారీగా విడదీసి, గ్రేడింగ్ చేసి, తూకం వేశారు. వాటి మొత్తం బరువు 11 టన్నులుగా తేల్చారు. వాటి విలువ సుమారు రూ.27 కోట్లుగా నిర్ధారించారు. అనంతరం వాటిని దహనం చేశారు. ఈ ప్రక్రియను ఓఎస్డీ సాయిమనోహర్, భద్రాచలం ఏఎస్పీ పరితోశ్ పంకజ్, పాల్వంచ డీఎస్పీ ఎన్ వెంకటేశ్, మణుగూరు డీఎస్పీ రాఘవేంద్రరావు పర్యవేక్షించారని ఎస్పీ రోహిత్రాజు తెలిపారు.