మణికొండ, జనవరి 29: హైదరాబాద్లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది. సోమవారం నార్సింగిలో ఓ యువతి నుంచి నాలుగు గ్రాముల ఎండీఎంఏ మత్తు పదార్థాన్ని ఎస్వోటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓ యువతి గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి టాలీవుడ్లోని సినీ ప్రముఖులకు చేరవేస్తున్నదన్న పక్కా సమాచారంతో నార్సింగి ఎస్వోటీ పోలీసులు నిఘా పెట్టారు. నార్సింగి బస్టాండ్లో సోమవారం లావణ్య అనే యువతి బస్సెక్కేందుకు యత్నిస్తుండగా ఆమెను పట్టుకున్నారు. హ్యాండ్బ్యాగులో తనిఖీలు చేయగా 4 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ దొరికాయి.
ఆ యువతిని లావణ్యగా గుర్తించిన పోలీసులు.. టాలీవుడ్లోని ఓ యువ సినీహీరో ప్రియురాలిగా తేల్చారు. గతంలోనూ లావణ్యపై మోకిలా పోలీస్స్టేషన్లో డ్రగ్స్ కేసు ఉన్నదని, ఆమె తప్పించుకుని తిరుగుతున్నదని పోలీసులు పేర్కొన్నారు. కోకాపేటలోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న లావణ్య ఇంటిని పోలీసులు తనిఖీ చేశారు. ఆమెతో కలిసి ఉంటున్న మరో యువకుడిని అరెస్టు చేసి ఇద్దరినీ రిమాండ్కు తరలించారు. నిందితుల నుంచి మొబైల్ ఫోన్, ల్యాప్టాప్, రూ.50 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.