హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ) : డ్రగ్స్ అనర్థాలపై విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు ఉన్నతవిద్యామండలి ప్రత్యేక చర్యలు చేపట్టింది. అందులోభాగంగా ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 2వేలకు పైగా కాలేజీల్లోనేగాకుండా వర్సిటీల్లో యాంటి డ్రగ్ కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో నార్కోటిక్ విభాగం, పోలీసుశాఖ, విద్యాశాఖల అధికారులు సంయుక్తంగా ఈ కమిటీల ఏర్పాటు విషయమై వర్సిటీలకు ఉన్నతవిద్యామండలి అధికారులు లేఖలు రాశారు. ఓయూ పరిధిలోని అన్ని కాలేజీల్లో ఈ కమిటీలను ఏర్పాటు చేసినట్టు వీసీ రవీందర్ తెలిపారు.
ఇదేతరహాలో రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్, పీజీ సహా అన్ని వృత్తివిద్యాకాలేజీల్లో కమిటీలను ఏర్పాటులో నిమగ్నమయ్యారు. దీంతోపాటు డ్రగ్స్ అనర్థాలను తెలిపే అంశాలను డిగ్రీ, పీజీ పాఠాల్లో చేర్చారు. ర్యాగింగ్ నివారణకు కమిటీలు ఏర్పాటు చేసి సత్ఫలితాలు సాధించగా, ఇదే కోవలో డ్రగ్స్ పై కమిటీల ఏర్పాటు మంచి ఫలితాలొస్తాయని అధికారులు భావిస్తున్నారు.