యాచారం, మార్చి 20: రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మొండిగౌరెల్లిలో మరోసారి డ్రోన్లు జోరుగా సంచరించడంతో అధికారులు భూముల సర్వేను గుట్టుచప్పుడు కాకుండా ప్రారంభించారని గ్రామస్తులు, రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బుధవారం రాత్రి మొండిగౌరెల్లిలో ఐదారు డ్రోన్లు గాల్లో తిరగడాన్ని గ్రామస్తులు సెల్ఫోన్లలో బంధించారు. ఇటీవలే మొండిగౌరెల్లిలో పారిశ్రామిక వాడ ఏర్పాటు కోసం ప్రభుత్వం 821.11ఎకరాల భూసేకరణకు శ్రీకారం చుట్టింది. దీనికోసం ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసింది.
గ్రామస్తులు నోటిఫికేషన్ను రద్దు చేయాలని ఆందోళనలకు దిగుతున్న విషయం తెలిసిందే, దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వమే రాత్రిపూట గుట్టు చప్పడు కాకుండా డ్రోన్ల ద్వారా భూముల సర్వే కొనసాగిస్తున్నదని గ్రామస్తులు అనుమానిస్తున్నారు. ఆరు నెలల క్రితం ఎలాంటి అనుమతులు లేకుండా మేడిపల్లి, నానక్నర్, తాటిపర్తి, కుర్మిద్ద, చింతపట్ల, ధర్మన్నగూడ, మొండిగౌరెల్లి, తులేఖుర్దు తదితర గ్రామాలలో డ్రోన్లు తిరిగిన విషయం తెలిసిందే. మొండిగౌరెల్లి గ్రామంలో డ్రోన్లు సంచరించడంతో గామస్తులు మండిపడుతున్నారు. ప్రభుత్వం ఎన్ని కుట్రులు చేసినా భూములు ఇచ్చేదిలేదని తెగేసి చెబుతున్నారు.