సుబేదారి, ఆగస్టు 28: నిత్యం పెరుగుతు న్న డీజిల్ ధరలు ఓ వైపు.. కొవిడ్ కారణంగా బండిసరిగా నడువక ఫైనాన్స్ కిస్తీలు కట్టలేని పరిస్థితులు మరోవైపు.. తిండిపెడుతుందని కొనుగోలు చేసిన బతుకు ‘బండి’ని అదే పెట్రోల్ పోసి తగులబెట్టాడో వ్యక్తి. నిత్యం జనంతో రద్దీగా ఉండే హనుమకొండ అదాలత్ జంక్షన్ వద్ద శనివారం ఈ ఘటన చోటుచేసుకొన్నది. హనుమకొండ గుండ్లసింగారానికి చెందిన శ్రీనివాస్ ఫైనాన్స్ నుంచి ఆటో కొని నడిపించుకుంటున్నాడు. కొంతకాలంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ధరలు పెంచడంతో డీజిల్ ధర ఆకాశాన్నంటింది. దీనికితోడు ఏడాన్నరగా కరోనా కారణంగా ఫైనాన్స్ కంపెనీకి డబ్బులు చెల్లించలేదు. కరోనా తగ్గుముఖం పడుతున్నా గిరాకీ లేక కుటుంబపోషణ భారమైంది. ఈ పరిస్థితులతో విసిగివేసారిన శ్రీనివాస్ శనివారం మధ్యాహ్నం నడిరోడ్డులో ఆటోపై పెట్రోల్ పోసి తగులబెట్టాడు. పెరిగిన డీజిల్ ధర, ఫైనాన్స్ వేధింపులు ఎలా భరించాలంటూ వచ్చీపోయేవారికి తన బాధ చెప్పుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. పేద, మధ్యతరగతి ప్రజల నడ్డివిరిచిందని కేంద్ర ప్రభుత్వానికి శాపనార్థాలు పెట్టారు.