హైదరాబాద్, మార్చి 13 : అర్బన్ భగీరథ పథకంలో భాగంగా వచ్చే ఏడాది మార్చి చివరి నాటికి రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లోని ప్రతి ఇంటికీ నల్లా నీటిని అందించనున్నారు. హైదరాబాద్ మినహా రాష్ట్రంలోని 141 పట్టణాల్లో ఇంటింటికీ నల్లా కనెక్షన్ ఇవ్వాలన్న లక్ష్యంతో రూ.6,578 కోట్లతో పనులు చేపట్టారు. ఇప్పటికే అత్యధిక పట్టణాల్లో పనులు పూర్తయ్యాయి. మరో 38 పట్టణాల్లో అర్బన్ భగీరథ పనులు నడుస్తున్నాయి. పట్టణాల్లో కొత్తగా వెలుస్తున్న కాలనీలు, ఇండ్లకు కూడా నల్లా కనెక్షన్లు ఇచ్చేందుకు వీలుగా పైపులైన్లు వేస్తున్నారు. భవిష్యత్తులో ఇంటి నిర్మాణం పూర్తయిన వెంటనే నల్లా కనెక్షన్ ఇచ్చేవిధంగా జాగ్రత్తలు తీసుకొంటున్నారు. వీటన్నింటి కోసం 2022-23 బడ్జెట్లో హైదరాబాద్ ఔటర్ రింగ్రోడ్డుకు అవతల ఉన్న పట్టణాల్లోని పనులకు రూ.800 కోట్లు, ఔటర్కు లోపల ఉన్న పట్టణాలకు రూ.700 కోట్లు కేటాయించారు. ఈ నిధులను పైపులైన్లు, ఇతర పనులకు వెచ్చించనున్నారు. ప్రతి వ్యక్తికి రోజుకు పట్టణాల్లో 135 లీటర్లు, నగరాల్లో 150 లీటర్ల చొప్పున నీటిని సరఫరా చేస్తారు. రాష్ట్రంలోని ఔటర్ అవతల ఉన్న 38 పట్టణాల్లో మూడు ప్యాకేజీలుగా విభజించి పనులు చేస్తున్నారు. వీటికి రూ.1,432 కోట్లతో పైపులైన్ పనులు, ఇతర పనులు చేపడుతున్నారు. ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న పట్టణాలు, గ్రామాల్లో నల్లా కనెక్షన్ల కోసం రూ.750 కోట్లతో 164 రిజర్వాయర్లు, 1,600 కిలోమీటర్ల పైపులైన్ల నిర్మాణం పనులు పూర్తిచేశారు.
ప్యాకేజీ 1 పరిధిలోని 11 పట్టణాలు:
కోరుట్ల, మెట్పల్లి, జగిత్యాల, పెద్దపల్లి, వేములవాడ, నిర్మల్, భైంసా, మందమర్రి, మంచిర్యాల, కాగజ్నగర్, బెల్లంపల్లి
ప్యాకేజీ 2 పరిధిలోని 9 పట్టణాలు:
జనగామ, నర్సంపేట, పరకాల, భూపాలపల్లి, మహబూబాబాద్, ఇల్లందు, సత్తుపల్లి, పాల్వంచ, మధిర
ప్యాకేజీ 3 పరిధిలోని 18 పట్టణాలు :
కామారెడ్డి, బోధన్, జహీరాబాద్, సంగారెడ్డి, సదాశివపేట, భువనగిరి, తాండూరు, వికారాబాద్, ఇబ్రహీంపట్నం, షాద్నగర్, వనపర్తి, గద్వాల, నారాయణ్పేట, అచ్చంపేట, కల్వకుర్తి, ఐజ, బాదేపల్లి, నాగర్కర్నూల్