Peddapalli | పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం లంబాడీ తండా(బి) తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. మిషన్ భగీరథ నీళ్లు రాక జనం ఇబ్బందులు పడుతున్నారు. తాగునీటి కోసం అజ్మీరా రవి అనే యువకుడు ఆందోళనకు దిగాడు. వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపాడు. తాగునీటి సమస్య పరిష్కరించకపోతే ఆత్మహత్య చేసుకుంటానని రవి బెదిరించాడు. తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు, గ్రామ కార్యదర్శి హామీ ఇవ్వడంతో రవి వాటర్ ట్యాంక్ నుంచి కిందకు దిగాడు.
కాంగ్రెస్ పాలనలో తాగునీటి కోసం అరిగోస పడుతున్నామని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో తాగునీటికి ఎలాంటి ఇబ్బంది రాలేదని స్థానికులు వాపోయారు. మిషన్ భగీరథ నీళ్లు కొన్ని రోజుల నుంచి రావడం లేదని రవి తెలిపాడు. అధికారులకు మొర పెట్టుకున్నప్పటికీ పట్టించుకోవడం లేదు. మా గ్రామ ప్రజలంతా తాగునీటి సమస్య ఎదుర్కొంటున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి మిషన్ భగీరథ నీళ్లు విడుదల చేయాలని రవి కోరాడు.