మాగనూరు, మే 24 : తాగునీటి కోసం ప్రజలు నానా అవస్థలు పడిన ఘటన నారాయణపేట జిల్లా మాగనూరు మండలం అమ్మపల్లిలో చోటుచేసుకున్నది. గురువారం కరెంట్ పోగా.. శుక్రవారం రాత్రి అయినా రాకపోవడంతో గ్రామస్తులు నీటికోసం తల్లడిల్లారు. 24 గంటలు గడిచినా విద్యుత్ను పునరుద్ధరించడంలో అధికారులు విఫలమయ్యారు. విషయం తెలుసుకున్న పంచాయతీ సెక్రటరీ శ్రీను వాటర్ ట్యాంకర్ తెప్పించారు. నీటికోసం వేచి చూస్తున్న గ్రామస్తులు ఒక్కసారిగా ట్యాంకర్ వద్ద గుమిగూడారు. కొంతమందికే నీళ్లు లభించడంతో మిగిలిన వారికి ఇబ్బందులు తప్పలేదు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో అవస్థలు పడాల్సి వస్తున్నదని గ్రామస్తులు వాపోయారు. ఈ విషయంపై ఏఈ దేవేందర్ను వివరణ కోరగా.. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం రావడంతోవిద్యుత్ లైన్లో సమస్య ఉన్నదని.. పరిష్కరించే పనిలో ఉన్నామని వివరించారు.