హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు రూ.50 కోట్ల విలువైన డ్రగ్స్ను పట్టుకున్నారు. మత్తు పదార్థాలు తయారుచేస్తున్న రెండు ల్యాబ్లపై సోమవారం దాడులు జరిపారు. ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు. ఈ కేసులో కీలక సూత్రధారి రూ.60 లక్షలతో నేపాల్కు పారిపోతుండగా అధికారులు గోరఖ్పూర్లో పట్టుకున్నారు. డ్రగ్స్ తయారీ నెట్వర్క్ను ఛేదించారు.
అధికారుల వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గోరఖ్పూర్ ప్రాంతానికి చెందిన ఒక ఫైనాన్షియర్ సహాయంతో హైదరాబాద్లో రెండు మెఫిడ్రాన్ తయారీ ల్యాబుల్లో ఎపిడ్రిన్ మత్తుపదార్థాన్ని తయారు చేస్తున్నారు. సమాచారం అందుకున్న డీఆర్ఐ అధికారులు ఈ నెల 21 నుంచి డ్రగ్స్ తయారీ ముఠాపై నిఘా పెట్టారు. పూర్తి సమాచారం సేకరించి సోమవారం రెండు ల్యాబ్లపై దాడులు జరిపారు. డ్రగ్స్ తయారు చేస్తున్న ఏడుగురిని పట్టుకున్నారు. నిందితుల నుంచి రూ.50 కోట్ల విలువైన 24.885 కిలోల ఎపిడ్రిన్ మత్తు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ తయారీకి సహకరిస్తున్న కీలక సూత్రధారి, ఫైనాన్సియర్ రూ.60 లక్షల నగదుతో నేపాల్కు పారిపోతుండగా అధికారులు గోరఖ్పూర్లో అరెస్టు చేశారు.
జైలు నుంచి తప్పించుకొని వచ్చి..
పట్టుబడిన ఏడుగురు నిందితులు గతంలో కూడా పలుచోట్ల డ్రగ్స్ తయారీ కేసుల్లో డీఆర్ఐకి చిక్కారు. ఈ కేసులో కీలక సూత్రధారి హైదరాబాద్లో ఒక హత్య కేసు, వడోదరలో ఒక చోరీ కేసులో నిందితుడు. ఇండోర్ తదితర ప్రాంతాల్లో డ్రగ్స్ తయారీ కేసులో పట్టుబడి జైలు కెళ్లాడు. ఇండోర్ జైలు నుంచి తప్పించుకున్న అతడు.. మళ్లీ డ్రగ్స్ తయారుచేస్తున్నట్టు అధికారులు తెలిపారు. నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా పెద్దఎత్తున డ్రగ్స్ తయారీ, సరఫరాకు యత్నిస్తున్న ఫైనాన్సియర్పై నిఘాపెట్టి అరెస్టు చేసినట్టు అధికారులు వెల్లడించారు.