హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ) : కళాశాల విద్యలో ప్రభుత్వం కీలక సంస్కరణలు తెచ్చింది. డిగ్రీ కాలేజీల్లో 15 ఏండ్లు పనిచేసిన లెక్చరర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లను ప్రొఫెసర్లుగా పరిగణిస్తూ కొత్త సర్వీస్ రూల్స్ను అమలు చేసింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ సోమవారం జీవో6ను జారీ చేశారు. అదేవిధంగా, డిగ్రీ కాలేజీల్లోని ప్రొఫెసర్లు ఏదైనా వర్సిటీలో నోటిఫికేషన్ ద్వారా నియామకమయ్యేలా వీలు కల్పిస్తూ ఉత్తర్వులిచ్చారు. ఈ మేరకు డిగ్రీ లెక్చరర్ / అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల రిక్రూట్మెంట్ కోటాను 33 శాతం నుంచి 50 శాతానికి పెంచారు.
గతంలో జూనియర్ లెక్చరర్లకు పదోన్నతులిచ్చి 70 శాతం డిగ్రీ కాలేజీల్లో భర్తీ చేసేవారు. మిగిలిన 30 శాతం పోస్టులను నోటిఫికేషన్ ద్వారా నింపేవారు. కానీ, అర్హులైన జూనియర్ లెక్చరర్లు లేకపోవడం, ఉన్న వారు ముందుకురాకపోవడంతో 70 శాతం పోస్టులు భర్తీ కావడం లేదు. ఈ నేపథ్యంలోనే డీఆర్ కోటాను 33 శాతం నుంచి 50 శాతానికి పెంచారు. రీజినల్ జాయింట్ డైరెక్టర్ పోస్టులు రెండు ఉండగా, ప్రస్తుతానికి వీటిని జాయింట్ డైరెక్టర్ పోస్టులుగా మార్చారు. కళాశాల విద్యలో అడినిస్ట్రేటివ్ ఆఫీసర్ల భర్తీకి హైదరాబాద్ వారే అర్హులు కాగా, నిర్దిష్ట సర్వీసు పూర్తిచేసుకొన్న ఎవరైనా ఈ పోస్టుకు అర్హులుగా పరిగణిస్తూ మార్పులు చేశారు.
టీజీసీటీఏ హర్షం
సర్వీస్ రూల్స్ మార్పు నిర్ణయం పట్ల తెలంగాణ గవర్నమెంట్ కాలేజీ టీచర్స్ అసోసియేషన్ ( టీజీసీటీఏ) అధ్యక్షుడు సంగి రమేశ్, చైర్మన్ డాక్టర్ కే విజయ్కుమార్, జనరల్ సెక్రటరీ డాక్టర్ ఈ బ్రిజేశ్ హర్షం వ్యక్తం చేశారు. కొత్త సర్వీసు రూల్స్ను జారీచేసిన సీఎం కేసీఆర్, విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, కళాశాల విద్య కమిషనర్ నవీన్మిట్టల్కు వారు ధన్యవాదాలు తెలిపారు.