ఆర్మూర్ ( నిజామాబాద్ ) : ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ చైర్మన్గా డాక్టర్ బద్దం మధుశేఖర్ నియమితులయ్యారు . నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణానికి చెందిన ఎంజే దవాఖాన నిర్వాహకుడు, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు డాక్టర్ బద్దం మధుశేఖర్ (Doctor Madhu Shekar) ను చైర్మన్ (Chairman) గా నామినేట్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు (Orders) జారీ చేసింది.
ఈ సందర్భంగా మధుశేఖర్ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి (Minister Vemula Prashant Reddy) ని వేల్పూర్లోని మంత్రి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డాక్టర్ మధుశేఖర్కు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. తనకు అత్యంత ఆప్తుడైన డాక్టర్ మధు శేఖర్కు ప్రతిష్టాత్మక పదవి రావడం తనకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు.
గతంలో ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ చైర్మన్గా ఉంటున్న ఇనిస్టిట్యూట్ను కార్పొరేషన్గా మార్చి తొలి చైర్మన్గా డాక్టర్ మధుశేఖర్ను తెలంగాణ ప్రభుత్వం నియమించింది. చైర్మన్తో సహా మొత్తం 13మందితో ఈ సంస్థ కార్యకలాపాలు నిర్వహించనున్నది.
ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ సంస్థలో చైర్మన్తో పాటు మొత్తం 13 మంది సభ్యులు ఉంటారు. వైద్యులు, స్టాఫ్ నర్సులు, ఏఎన్ఎం, ఆరోగ్య సంరక్షణా సిబ్బంది కోసం శిక్షణ ఇచ్చే ఉన్నత స్థాయి సంస్థ ఇది. ప్రజారోగ్యం, వైద్యరంగంలో వివిధ అధ్యయనాలను చేపట్టేందుకు పరిశోధనా సంస్థగా పని చేస్తుందని మంత్రి వివరించారు.