జహీరాబాద్, అక్టోబర్ 12: ముంబై-హైదరాబాద్ వయా జహీరాబాద్ బుల్లెట్ రైలుపై ఆశలు చిగురిస్తున్నాయి. ఈ మార్గంలో బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను రైల్వేశాఖ ఆధ్వర్యంలోని నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. నూతన రైల్వే నిర్మాణం కోసం ఈ సంస్థ ఇప్పటికే పలు ప్రాంతాల్లో మట్టి పరీక్షలు, సర్వేలు చేసినట్టు తెలిసింది. ప్రతిపాదిత బుల్లెట్ రైలు మార్గంలో పలుచోట్ల వాగులు, పెద్ద చెరువులు, రోడ్లు ఉన్నాయి. ఆ ప్రదేశాల్లో కల్వర్టులు, వంతెనలు నిర్మించేందుకు మట్టిని పరీక్షిస్తున్నారు.
ప్రత్యేక యంత్రం ద్వారా భూమిలోకి డ్రిల్ వేసి అక్కడి భూమి పటిష్ఠతను పరిశీలిస్తున్నారు. ఈ సర్వేకు సంబంధించిన నివేదికను త్వరలోనే ప్రభుత్వానికి అందజేయనున్నట్టు సమాచారం. ఈ సంస్థ ఇచ్చే డీపీఆర్ ఆధారంగా కేంద్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనున్నది. బుల్లెట్ రైలు అందుబాటులోకి వస్తే హైదరాబాద్ నుంచి ముంబైకి 3:50 గంటల్లోనే చేరుకొనే అవకాశం ఉంటుంది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో జాతీయ ఉత్పత్తి మండలి (నిమ్జ్)ని ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో జహీరాబాద్ను కూడా కవర్ చేసే విధంగా డీపీఆర్ను రూపొందిస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికే పలు అంతర్జాతీయ సంస్థలు ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొన్నాయి. దీంతో వ్యాపారులు, ఉద్యోగులు ముంబై, హైదరాబాద్ నుంచి జహీరాబాద్కు తక్కువ సమయంలో చేరుకోవడానికి బుల్లెట్ రైలు ఎంతగానో ఉపయోగపడుతుంది.