హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): ప్రత్యేక ఓటరు సవరణ ప్రక్రియ (సర్)పై ఇతర రాష్ర్టాల్లో మాదిరిగా రాష్ట్రంలోనూ అనేక అనుమానాలు ఉన్నాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ప్రభుత్వం ఇందుకోసం సరిపడా సిబ్బందిని నియమించలేదని, బీఎల్ఏలకు సరైన శిక్షణ ఇవ్వలేదని ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో ‘సర్’ ప్రక్రియ విజయవంతమయ్యే పరిస్థితులు కనిపించడం లేదని ఆందోళన వ్యక్తంచేశారు. శనివారం తెలంగాణభవన్లో ఆయన మీడియాతో చిట్చాట్ చేశారు.
రాష్ట్రంలో కొనసాగుతున్న ‘సర్’ ప్రక్రియ ప్రారంభమై 15రోజులు కావస్తున్నా 30శాతం ఎన్యుమరేషన్ ఫారాలు ప్రజలకు పంపిణీ చేయలేదని మండిపడ్డారు. ఫారం 6,7లను ప్రజలకు అందుబాటులో లేవని పేర్కొన్నారు. ఎన్నికలం సంఘం నిర్ధేశించిన లక్ష్యంలో హైదరాబాద్లో 5శాతం కూడా పూర్తికాలేదని తెలిపారు. ‘సర్’పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ ప్రక్రియపై ప్రత్యేక దృష్టిసారించాలని డిమాండ్ చేశారు. ప్రతి పది ఇండ్లకు ఒక అధికారిని నియమించాలని ఆయన కోరారు.
తనకు రెజ్లింగ్ అంటే ఎంతో ఇష్టమని తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు. తన జీవితకాలంపాటు జాతీయ, అంతర్జాతీయ రెజ్లింగ్ పోటీలకు హాజరయ్యే క్రీడాకారులు, వారి కోచ్లకు అవసరమైన సహకారాన్ని అందిస్తానని హామీ ఇచ్చారు. సోమవారం తెలంగాణ భవన్లో నగరంలోని జిమ్ల నిర్వాహకులు, రెజ్లర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారి సాధకబాధకాలను అడిగి తెలుసుకున్నారు. రెజ్లింగ్ క్రీడాకారులకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అనంతరం ఈనెల 24న తెలంగాణభవన్లో జరిగే మోడల్ రెజ్లింగ్ పోటీల ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సమావేశంలో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి తలసాని సాయి కిరణ్యాదవ్ తదితరులు పాల్గొన్నారు.