హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్లో రాబోయే ఎన్నికల్లో పొత్తులపై అనుమానాలు తొలగిపోతున్నాయి. జనసేన అధినేత రెండు రోజులుగా చేస్తున్న ప్రకటనలు ఏపీలో బీజేపీ- టీడీపీ- జనసేన మధ్య పొత్తు దాదాపు ఖరారైనట్టు అర్థమవుతున్నది. వైసీపీని గద్దె దించడమే జనసేన ఏకైక లక్ష్యమని, అందుకోసం ఓట్లు చీలకుండా పొత్తులు తప్పనిసరి అని జనసేన అధినేత పవన్కల్యాణ్ ప్రకటించారు.
డిసెంబర్లో ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నదని, జూలై నుంచి ఇక్కడే ఉంటానని మంగళగిరిలో శుక్రవారం జరిగిన మండల, డివిజన్ అధ్యక్షుల సమావేశంలో ప్రకటించారు. త్రిముఖ పోటీలో బలికావడానికి జనసేన సిద్ధంగా లేదని, సీఎం, సీఎం అని కేకలు వేస్తే సీఎం కాలేనని అభిమానులకు చెప్పారు. పవన్ వ్యాఖ్యలపై వైసీపీ మంత్రులు మండిపడుతున్నారు. జనసేన కార్యకర్తలను, కాపులను మోసం చేశారని, వారందరినీ చంద్రబాబుకు ప్యాకేజీకి అప్పగించారని విమర్శించారు.