హైదరాబాద్, మార్చి 6 (నమస్తే తెలంగాణ): మూసీ రివర్ఫ్రంట్ ప్రాజెక్టు వల్ల నిరాశ్రయులయ్యే నిరుపేదలకు గత ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అసంపూర్తిగా ఉన్న గృహాలను పూర్తిచేసేందుకు కేంద్ర ప్రభుత్వం రూ. 400 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించడంతో త్వరలోనే పనులు చేపట్టనున్నారు. నగరం మధ్య నుంచి దాదాపు 50 కిలోమీటర్ల మేర మూసీనది ప్రవహిస్తున్నది. దానికి ఇరువైపులా 50 వేలకుపైగా కుటుంబాలు గుడిసెలు వేసుకుని జీవిస్తున్నాయి. రివర్ఫ్రంట్ ప్రాజెక్టు కోసం వీరందరినీ అక్కడి నుంచి ఖాళీ చేయించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు పంపిణీ చేయకుండా మిగిలి ఉన్న డబుల్ బెడ్రూం ఇండ్లను నిరాశ్రయులకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేసీఆర్ ప్రభుత్వం రూ. 12,272.61కోట్లు ఖర్చుచేసి 1,94,859 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం చేపట్టింది. అందులో 1,48,521 గృహాలు పూర్తికాగా, మిగిలిన 46,338 ఇండ్లు వివిధ దశల్లో ఉన్నాయి. వీటిలో పదివేలకుపైగా ఇండ్లు తుదిదశలో ఉన్నాయి. పూర్తయిన ఇండ్లలో సుమారు 70వేలు లబ్ధిదారులకు పంపిణీ చేశారు.