CM KCR | మహబూబ్నగర్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): వారంతా నిత్యం దైవనామస్మరణలో తరిస్తుంటారు. ధూపదీప నైవేద్యాల నడుమ ఉండే పురోహితులు. దైవం, పూజలు తప్ప వారికి వేరే ధ్యాస ఉండదు. చిన్న చిన్న గుళ్లు, గోపురాల్లో నిత్యం పూజలు చేస్తూ భక్తులు ఇచ్చే కానుకలతో కడుపు నింపుకొంటారు. పేరుకే బ్రాహ్మణులే అయినా చాలామంది పూటగడవని పేదోళ్లే. వారిది తమ పేదరికాన్ని బయటకు చెప్పుకోలేని దైన్య స్థితి. రోజూ భక్తులు ఇచ్చే దక్షిణ పూటగడవాడినికే సరిపోతుంది. ఇక సొంతిళ్లు అనేది వారికి కలే. కానీ.. ఆ కలను నిజం చేసి వారిపాలిట సీఎం కేసీఆర్ దేవుడయ్యారు. పాలమూరు జిల్లా అర్బన్ మండలంలోని దివిటిపల్లి గ్రామంలో అడగకుండానే ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 64 కుటుంబాలకు డబుల్బెడ్రూం ఇండ్లు కేటాయించి, వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టారు. ఇందుకు కృతజ్ఞతగా బ్రాహ్మణులు ఆ డబుల్ బెడ్ రూం ఇండ్ల వీధికి ‘కేసీఆర్ అగ్రహారం’గా నామకరణం చేశారు. తమ పూజలు ఫలించాయని.. ఆ దేవుడే దిగివచ్చి తమకు నిలువ నీడ కల్పించాడని ఆ బ్రాహ్మోణోత్తములు కేసీఆర్ను నిండు మనసుతో ఆశీర్వదిస్తున్నారు. 64 కుటుంబాల లబ్ధిదారులు, బ్రాహ్మణ సేవాపరిషత్తు నేతలు సంయుక్తంగా సీఎం కేసీఆర్, మంత్రి శ్రీనివాస్గౌడ్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేసి, తమ అభిమానాన్ని చాటుకొన్నారు.
జాతీయ రహదారి పక్కనే ఇండ్లు
మహబూబ్నగర్ రూరల్ మండలం దివిటిపల్లి గ్రామం జాతీయ రహదారి 44ను ఆనుకొని ఉంటుంది. ఈ గ్రామంలో ఉన్న ప్రభుత్వ స్థలంలో రూ.66 కోట్లతో 1,024 డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించారు. ఈ ఇండ్ల నిర్మాణానికి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయగా, పూర్తయిన ఇండ్లను 2021 జూన్ 22న మంత్రులు వేముల ప్రశాంత్రెడ్డి, శ్రీనివాస్గౌడ్ ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులతో సామూహిక గృహ ప్రవేశం చేయించారు. దశలవారీగా వివిధ వర్గాలకు ఇండ్లను కేటాయిస్తున్న తరుణంలో బ్రాహ్మణ పరిషత్తు నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిశారు. తమకు కూడా డబుల్ బెడ్రూం ఇండ్లను కేటాయించాలని కోరారు. సీఎం ఆదేశాల మేరకు మంత్రి శ్రీనివాస్గౌడ్ ఏకంగా 64 కుటుంబాలకు డబుల్బెడ్రూం ఇండ్లు కేటాయించారు. దీంతో ఆ బ్రాహ్మణులంతా 2021 డిసెంబర్ 19న సామూహిక గృహప్రవేశం చేశారు. తమ సొంతింటి కలను నెరవేర్చిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతగా పాలమూరు బ్రాహ్మణ సేవా సమితి ప్రధాన కార్యదర్శి రాఘవేంద్రశర్మ నేతృత్వంలో ఆ కాలనీకి ‘కేసీఆర్ అగ్రహారం’గా నామకరణం చేశారు. బ్రాహ్మణుల్లో నిరుపేదలను గుర్తించి డబుల్బెడ్రూం ఇండ్లు ఇవ్వడం చాలా గొప్ప విషయమని తెలంగాణ సర్కారును అభినందించారు. కాగా, 44వ జాతీయ రహదారికి ఆనుకొని, రైల్వేస్టేషన్ పక్కనే నిర్మించిన ఈ డబుల్ బెడ్రూం ఇండ్లు ఎంతో ఖరీదైన ప్రదేశంలో నిర్మించారు. ఈ ఇండ్ల పక్కనే టీఎస్ఐఐసీ ఐటీ హబ్ కూడా ఉండడంతో భవిష్యత్తులో ఈ గ్రామం రూపురేఖలే మారనున్నాయి. ఈ గ్రామాన్ని మహబూబ్నగర్ కార్పొరేషన్లో విలీనం చేసేందుకు ప్రతిపాదించారు.
మళ్లీ కేసీఆరే ముఖ్యమంత్రి.. లక్ష మెజార్టీతో శ్రీనివాస్గౌడ్ గెలుపు
పాలమూరులో ఏకంగా 64 బ్రాహ్మణ కుటుంబాలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు కేటాయించిన కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారని, మంత్రి శ్రీనివాస్గౌడ్ లక్ష మెజార్టీతో గెలుస్తారని ‘కేసీఆర్ అగ్రహారం’ బ్రాహ్మణులు ఆశీర్వదించారు. 64 కుటుంబాలకు చెందిన బ్రాహ్మణులు వేదమంత్రోచ్ఛరణలు చేస్తూ అగ్రహారంలో ఇటీవల భారీ ప్రదర్శన చేపట్టారు. వచ్చే ఎన్నికల్లో స్వచ్ఛందంగా తామే కేసీఆర్ పథకాలను కరపత్రం రూపంలో ముద్రించి, ఏ శుభ కార్యానికి వెళ్లిన అక్కడకు వెళ్లి పంచుతామని.. బీఆర్ఎస్ వెంటే ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లయినా ఏ ప్రభుత్వం పేద బ్రాహ్మణులను గుర్తించలేదని.. రాష్ట్రవ్యాప్తంగా బ్రాహ్మణులకు గుర్తింపునిచ్చి.. ఆత్మగౌరవ భవనంతోపాటు వేద పాఠశాలలు, కమ్యూనిటీ హాళ్లకు నిధులు ఇస్తున్న కేసీఆర్ నిజంగానే పేదల దేవుడని కీర్తించారు. మళ్లీ కేసీఆర్ ప్రభుత్వమే రావాలని.. మంత్రి శ్రీనివాస్గౌడ్ను అఖండ మెజార్టీతో గెలిపించాలని ఆ ముక్కోటి దేవతలను ప్రార్థిస్తున్నామని చెప్పారు.
అందుకే ఆ పేరు పెట్టాం
70 ఏండ్లలో ఏ ప్రభుత్వం కూడా పేద బ్రాహ్మణులను ఆదుకోలేదు. తెలంగాణ వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను అందించి మా జీవితాల్లో వెలుగులు నింపారు. తెలంగాణవ్యాప్తంగా ఎక్కడాలేని విధంగా పాలమూరులోనే 65 బ్రాహ్మణ కుటుంబాలకు ఇండ్లు కేటాయించారు. అందుకే మా కాలనీకి ‘కేసీఆర్ అగ్రహారం’ అని పేరు పెట్టుకొన్నాం.
-గొండ్యాల రాఘవేంద్రశర్మ, పాలమూరు బ్రాహ్మణ సేవా సమితి ప్రధాన కార్యదర్శి, పాలమూరు
కేసీఆర్ వెన్నంటి ఉంటాం
తెలంగాణ ఏర్పడ్డ తర్వాత అందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు. సీఎం కేసీఆర్ అన్ని వర్గాల సంక్షేమానికి పాటుపడుతున్నారు. ఏ వర్గంలో నిరుపేదలున్నా వారిని ఆదుకొని, అక్కున చేర్చుకొంటున్నారు. నిత్యం దైవనామస్మరణ తప్ప సంపాదనపై ధ్యాసలేని మాకు నిలువనీడనిచ్చి, మా ఆత్మగౌరవాన్ని కాపాడారు. కృతజ్ఞతగా మేము కేసీఆర్ వెన్నంటే ఉంటాం. ఎన్నికల్లో ఆయన గెలుపు కోసం కృషి చేస్తాం.
-గోపాలశర్మ జోషి, తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు డైరెక్టర్
సీఎంకు రుణపడి ఉంటాం
బ్రాహ్మణ కుటుంబాలకు డబుల్ బె డ్రూం ఇండ్లు ఇచ్చి సీఎం ఎంతో పుణ్యం చేసుకున్నారు. ఇండ్లు పొందిన లబ్ధిదారుల్లో నేను కూడా ఉన్నా.. గుళ్లల్లో పూజలు చేస్తూ నిత్యం ధూపదీప నైవేద్యాలు సమర్పించే మాకు సొంత ఇల్లు అనేది ఒక కలగానే ఉండేది. ఆ కల కేసీఆర్ రూపంలో నెరవేరింది. నిజంగా ఆయన మాకు దైవంతో సమానం.
-మయూరి జోషి, కేసీఆర్ అగ్రహారం, దివిటిపల్లి, మహబూబ్నగర్
సొంతింటి కల నెరవేరింది
మేం పేద బ్రాహ్మణులం. ఏ ప్రభుత్వం కూడా మమ్మల్ని ఆదుకోలేదు. మాకు సొంత ఇల్లు కలగానే ఉండేది. అద్దె ఇంట్లో ఉండే వాళ్లం. సొంతింటి కల నెరవేరుతుందా? అని అనుకుంటున్న దశలో బ్రాహ్మణుల్లో పేదోళ్లను గుర్తించి డబుల్ బెడ్రూం ఇండ్లు ఇచ్చారు. మా సొంతింటి కలను నెరవేర్చారు. మా దాంట్లో పేదలు ఎవరున్నారో సర్వే చేసి మరీ ఇండ్లు ఇచ్చారు. మాకు నిలువ నీడనిచ్చిన మహానుభావులను మేం ఎన్నటికీ మరువం. ఇది సీఎం కేసీఆర్ ఘనతే. మా పేద కుటుంబాలకు ఆదుకొనేందుకు ఇండ్లు ఇచ్చిన మంత్రి శ్రీనివాస్గౌడ్కు కృతజ్ఞతలు.
-గీతాలక్ష్మి, కేసీఆర్ అగ్రహారం, దివిటిపల్లి, మహబూబ్నగర్