హైదరాబాద్, ఫిబ్రవరి 13 : ఇంటర్ వార్షిక పరీక్షలకు సంబంధించిన ప్రధాన ప్రశ్నలు, సమాధానాలు, ప్రాక్టికల్ తరగతులు వచ్చేవారం నుంచి టీశాట్, దూరదర్శన్లో ప్రసారం కానున్నాయి. ఇందుకు ఇంటర్బోర్డు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మార్చి 23 నుంచి ఏప్రిల్ 8 వరకు ఇం టర్ ప్రాక్టికల్స్, ఏప్రిల్ 20 నుంచి మే 5 వరకు వార్షిక పరీక్షలు జరుగనున్నాయి. గతేడాది పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు ప్రత్యేకంగా స్టడీ మెటీరియల్ ఇచ్చినా.. ఫస్టియర్ పరీక్షల్లో 51 శాతం విద్యార్థులు ఫెయిలయ్యారు. ఈ నేపథ్యంలో ముఖ్యమైన ప్రశ్నలను కొన్నింటిని తయారుచేసి, వాటికి సమాధానాలను సైతం సిద్ధంచేసి వాటిని డిజిటల్ రూపంలోకి మార్చి టీవీల ద్వారా ప్రసారం చేయాలని ఇంటర్బోర్డు నిర్ణయించింది. ఇదే తరహాలో ప్రాక్టికల్స్ తరగతులను సైతం టీవీల్లో ప్రసారంచేయాలని భావిస్తున్నది. ప్రశ్న లు సమాధానాలను ప్రతిరోజు, ప్రాక్టికల్స్ను మాత్రం ఆదివారం మాత్రమే ప్రసారం చేయనున్నారు. ఇది వరకు థియరీ క్లాసులను మాత్రమే టీశాట్ ద్వారా ప్రసారంచేయగా.. తాజాగా ప్రయోగాల క్లాసులను సైతం డిజిటల్గా ప్రసారం చేయనుండటం విశేషం.