హైదరాబాద్, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో సీజనల్ వ్యాధులపై ఆందోళన చెందవద్దని, పరిస్థితి అదుపులోనే ఉన్నదని వైద్యారోగ్యశాఖ అధికారులు స్పష్టంచేశారు. వర్షాల నేపథ్యంలో సీజనల్ వ్యాధుల పరిస్థితిపై గురువారం హెల్త్ సెక్రటరీ రిజ్వీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్షలో డీపీహెచ్ శ్రీనివాసరావు, డీఎంఈ రమేశ్రెడ్డి, టీవీవీపీ కమిషనర్ అజయ్కుమార్, డీఎంహెచ్వోలు, డీసీహెచ్లు, టీచింగ్ హాస్పిటళ్లు, జిల్లా దవాఖానల సూపరింటెండెంట్లు, ప్రోగ్రాం ఆఫీసర్లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఉన్నతాధికారులు మాట్లాడుతూ.. రాష్ట్రంలో డెంగీ కేసులు పెరుగుతున్నట్టు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని చెప్పారు. జ్వరాల కేసులు ఆందోళనకర స్థాయిలో లేవని, ఇప్పటివరకు ఒక్క మరణం నమోదు కాలేదని పేర్కొన్నారు. అవసరమైతే జ్వరాల కోసం ప్రత్యేక ఓపీ కౌంటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. డీఎంహెచ్వోలు హైరిస్క్ ఏరియాల్లో జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు.
ములుగులో డెంగీ కేసులపై దుష్ప్రచారం
ములుగు జిల్లాలో డెంగీతో వారం రోజుల్లోనే 10 మంది మరణించారంటూ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని అధికారులు పేర్కొన్నారు. వర్షాకాలం ప్రారంభం నుంచే జిల్లాలో వైద్యారోగ్య సిబ్బంది పూర్తి అప్రమత్తంగా ఉన్నారని, గ్రామాల్లో 398 క్యాంపులు నిర్వహించి 24,678 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా.. 1,392 మంది జ్వరబాధితులు, 28 మంది మలేరియా బాధితులను గుర్తించామని వివరించారు. డెంగీతో నలుగురు మరణించారని చెప్పారు. అందులో ఒకరికి గుండెజబ్బు, మరొకరికి సికిల్సెల్ అనీమియా, ఇద్దరికి కామెర్లు వంటి వ్యాధులు ఉన్నాయని పేర్కొన్నారు.