వ్యవసాయ యూనివర్సిటీ, జనవరి 14: వ్యవసాయ యూనివర్సిటీ భూములను హైకోర్టుకు ఇవ్వొద్దని, జీవో 55ను వెనక్కి తీసుకునే వరకు ఉద్యమం కొనసాగుతుందని రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ యూనివర్సిటీ విద్యార్థులు మరోమారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆదివారం ఏడోరోజు కూడా విద్యార్థుల నిరసన కొనసాగింది. ఉదయం వర్సిటీ ప్రధాన గేటు వద్ద బైఠాయించిన విద్యార్థులు అక్కడి నుంచి బయోడైవర్సిటీకి ర్యాలీగా వెళ్లారు. ‘సేవ్ ద యూనివర్సిటీ ల్యాండ్స్’, ‘సేవ్ ఫార్మర్స్’, ‘స్టూడెంట్ పవర్.. నేషనల్ పవర్’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మనసు మారాలని కోరుతూ భోగి మంటలు వేశారు. వీరికి వర్సిటీ ఉద్యోగులు, శాస్త్రవేత్తలు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో వర్సిటీ కళాశాల విద్యార్థి సంఘాల నాయకులు రాజ్కుమార్, శ్రీజ, అరవింద్, మధుకర్, సత్యమూర్తి, భానుచందర్, హరిప్రియ, శిరీష తదితరులు పాల్గొన్నారు.