వ్యవసాయ యూనివర్సిటీ/అశ్వారావుపేట, జనవరి 12 (నమస్తే తెలంగాణ): వ్యవసాయ యూనివర్సిటీ భూములను హైకోర్టుకు ఇవ్వొద్దని, సంబంధిత జీవో 55 విరమించేవరకూ ఉద్యమిస్తామని ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ వర్సిటీ విద్యార్థులు తేల్చిచెప్పారు. శుక్రవారం ఐదోరోజు ఉదయంనుంచే వర్సిటీ ప్రధాన గేటు వద్ద బైఠాయించారు. తరగతులను బహిష్కరించి, బయోడైవర్సిటీ క్షేత్రానికి ర్యాలీగా తరలివెళ్లారు. పాలు, నీళ్లతో కడిగి కుంకుమ, పసుపుతో చెట్లకు పూజలు చేశారు. వంటావార్పు నిర్వహించి, బతుకమ్మ ఆడుతూ వినూత్నంగా నిరసన తెలిపారు. సేవ్ ది యూనివర్సిటీ ల్యాండ్స్, సేవ్ ఫార్మర్స్, స్టూడెంట్ పవర్.. నేషనల్ పవర్ అంటూ నినదించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ శాస్త్రవేత్తలు, టీచింగ్, నాన్టీచింగ్ ఉద్యోగులు, విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనలు చేపడుతున్నా.. ప్రభుత్వం మాత్రం ఒంటెద్దు పోకడలు పోతున్నదని మండిపడ్డారు.
ఈ పరిధిలో హైకోర్టును నిర్మించడంవల్ల పర్యావరణం, వ్యవసాయ పరిశోధనలు, జీవ వైవిధ్యానికి ప్రమాదం పొంచి ఉన్నదని తెలిపారు. రైతు కుటుంబం, గ్రామీణ ప్రాంతంనుంచి వచ్చిన సీఎం రేవంత్రెడ్డికి వ్యవసాయ యూనివర్సిటీ విలువ తెలియకపోవడం విడ్డూరంగా ఉన్నదని అన్నారు. ఇక్కడ దాదాపు 40 ఏండ్లకుపైగా వర్సిటీ, అనుబంధ సంస్థలు కొనసాగుతున్నాయని, అనేక పరిశోధనలు, వేలాదిమంది వ్యవసాయ విద్యార్థులకు, ప్రధానంగా రాష్ట్ర రైతాంగానికి ఈ యూనివర్సిటీ అండగా ఉన్నదని వెల్లడించారు. మాజీ సీఎం రోశయ్య 2008లో బయోడైవర్సిటీ పార్కును ఏర్పాటు చేసి, దీన్ని మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉన్నదని సూచించినట్టు గుర్తుచేశారు. నిరసనలో విద్యార్ధి సంఘాల నాయకులు రాజ్కుమార్, శ్రీజ, అరవింద్, మధుకర్, సత్యమూర్తి, సురేందర్, దీక్షిత్, భానుచందర్, హరిప్రియ, శిరీష, అరవింద్, వంశీచందర్రెడ్డి, వినయ్రెడ్డి, బాలకోటినాయక్, శంకర్నాయక్, రాకేశ్ తదితరులు పాల్గొన్నారు.
అశ్వారావుపేటలో కదంతొక్కిన విద్యార్థులు
అగ్రికల్చర్ యూనివర్సిటీకి చెందిన 100 ఎకరాల భూమిని హైకోర్టుకు కేటాయిస్తూ జారీ చేసిన 55 జీవోను వెంటనే రద్దు చేయాలని అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల విద్యార్థులు డిమాండ్ చేశారు. శుక్రవారం భోజన విరామ సమయంలో వ్యవసాయ కళాశాల ఎదుట ఆందోళన చేపట్టారు. తొలుత కళాశాల ప్రాంగణం నుంచి జాతీయ రహదారి వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే జీవో 55ను రద్దు చేయకుంటే భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.