పాలకుర్తి : దేశ స్వాతంత్య్రం, తెలంగాణ సాధనలో ప్రాణాలు అర్పించిన మహనీయుల త్యాగాలను మరచిపోవద్దని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కోరారు. గణ తంత్ర వేడుకల సందర్భంగా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు లోని స్కూల్ ఆవరణ, స్థానిక మసీదులో ఏర్పాటు చేసిన జాతీయ జెండాను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మహాత్మాగాంధీ విగ్రహానికి, అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్ర సమర యోధుల త్యాగాల ఫలితంగా నేడు స్వేచ్ఛవాయువులు పీలుస్తున్నామని పేర్కొన్నారు. భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్దదని అన్నారు. దేశ పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ సమాన అవకాశాల్ని అందించడానికి పునరంకితం అయ్యే రోజని పేర్కొన్నారు.
భారత స్వాతంత వజ్రోత్సవాలను నిర్వహించుకుని దేశ కీర్తి ప్రతిష్టలను దశదిశలా చాటుకున్నామని అన్నారు.ఉద్యమ నాయకుడిగా తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సీఎం కేసీఆర్ సాధించిన తెలంగాణ అనతికాలంలోనే దేశంలో అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిచిందని వెల్లడించారు. అనేక వినూత్న పథకాలతో దేశానికే ఆదర్శంగా నిలిచిందని తెలిపారు.
తెలంగాణ మోడల్ ను, కేసీఆర్ నాయకత్వాన్ని దేశ ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు.బంగారు తెలంగాణ సాధించిన విధంగానే బంగారు భారత నిర్మాణంలో పాలుపంచుకోవడానికి జాతీయ స్థాయికి వచ్చారని వెల్లడించారు.రాజ్యాంగ స్ఫూర్తిని నింపుకుంటూ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత అందరిమీద ఉందని మంత్రి అన్నారు.