హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ)/కమలాపూర్: మంత్రి పొన్నం ప్రభాకర్ తాజాగా మరో వివాదంలో ఇరుక్కున్నారు. రెండు నెలల క్రితం ఓ అధికారితో మంత్రి పొన్నం ప్రభాకర్ జరిపిన ఫోన్ సంభాషణ వాయిస్ రికార్డు లీక్ కావడం కలకలం సృష్టించింది. మంత్రి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయినప్పటికీ, ఆ విషయాన్ని పక్కన పెట్టి తన మాటలను రికార్డు చేసి లీక్ చేసిన అప్పటి హనుమకొండ ఆర్డీవోపై చర్యలు తీసుకోవాలని మంత్రి కోరడం చర్చనీయాంశంగా మారింది. ఐదు రోజులుగా ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై మంత్రి తీవ్రంగా స్పందించి సదరు అధికారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి ఫిర్యాదు చేశారు.
ఫోన్ సంభాషణ ఇలా.. ‘గత ప్రభుత్వంలో హుజూరాబాద్ ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్ ఉంటే అధికార పార్టీ ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేయించిండ్రు. ఇప్పుడు కౌశిక్రెడ్డి అధికార పార్టీ ఎమ్మెల్యే కాదు. మా కంటెస్ట్ అభ్యర్థి ప్రణవ్ చేతుల మీదుగా లేదా ప్రొటోకాల్ కాదంటే అధికారులే నేరుగా వెళ్లి లబ్ధిదారులకు చెక్కులు అందజేయాలి. ఒక్క చెక్కు ఎమ్మెల్యే చేతికి పోయినా బాగుండదు’ అని మంత్రి పొన్నం అప్పటి హనుమకొండ ఆర్డీవో, కమలాపూర్ తహసీల్దార్ మాధవికి హుకుం జారీ చేసిన ఆడియో వైరల్ అయ్యింది. దీంతో తన ఫోన్ వాయిస్కాల్ రికార్డును లీక్ చేసిన హనుమకొండ ఆర్డీవో (ప్రస్తుతం బదిలీ అయ్యారు)పై చర్యలు తీసుకోవాలని సీఎస్కు మంత్రి ఫిర్యాదు చేశారు. ఆర్డీవోపై ఫిర్యాదు విషయాన్ని మంత్రి పొన్నం బుధవారం గాంధీభవన్లో మీడియాతో నిర్వహించిన చిట్చాట్లో ప్రస్తావించారు.