వనపర్తి : మానవుడు నిరంతర విద్యార్థని , జీవితంలో ఏదైనా సాధించాలంటే నిరంతర ప్రయత్నాన్ని ఓ సాధనగా మలుచుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా వల్లభ్ నగర్ లో షెడ్యూల్డ్ కులాల విద్యార్థులకు గ్రూప్ 2,3,4 ఉద్యోగాల శిక్షణకేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ తనకు అంతా తెలుసు అనుకోవడం తప్పు . ఇంకా నేర్చుకోవాలి అనుకున్న వారే గొప్ప ’వారవుతారని అన్నారు.
శిక్షణ పొందుతున్న వారు శక్తివంచన లేకుండా చదవాలని సూచించారు. ఫలితాలు వచ్చిన తర్వాత ఉద్యోగం రానివారు నిరాశ చెందవద్దని,జీవితంలో అవకాశాల కోసం నిరంతరం ప్రయత్నం చేయాలని అన్నారు. ప్రభుత్వం నిరుపేదల కోసం గ్రూప్ ఉద్యోగాల కొరకు 33 జిల్లాలలో మూడు నెలలు శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసిందన్నారు. ఉద్యోగాల శిక్షణకు వచ్చే విద్యార్థులను ఒరిజినల్ సర్టిఫికెట్లు కావాలని నిబంధన పెట్టొద్దని అధికారులకు ఆదేశించారు.వివిధ కారణాల చేత వారి సర్టిఫికెట్లు ఆయా సంస్థలలో ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ప్రభుత్వ ఉత్తర్వులకు అదనంగా శిక్షణ కోసం తన వద్దకు విద్యార్థులు వస్తే శిక్షణకు అయ్యే ఖర్చును భరిస్తానని మంత్రి వెల్లడించారు.గ్రూప్ ఉద్యోగాల శిక్షణకు వచ్చిన అభ్యర్థులకు మంత్రి పలు ప్రశ్నలు వేసి నగదు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ తేజన్ నందలాల్ పవార్, మార్కెట్ చైర్మన్ పలుస రమేశ్ గౌడ్ , మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్ , వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. గతంలో సింగిరెడ్డి ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శిక్షణ పొంది కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాలకు క్వాలిఫై అయిన అలంపూర్ తాలూకా ఊట్కూరు వాసి ప్రీతిని మంత్రి అభినందించారు.అనంతరం నాగవరంలో వరి నాటే యంత్రం, వరి కోత యంత్రం షోరూమ్ ను మంత్రి ప్రారంభించారు.