మహబూబ్ నగర్ : వెనుకబడ్డ పాలమూరును అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తుంటే కొందరు అపోహలు సృష్టించేందుకు యత్నిస్తున్నారని రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. ఇటువంటి వారి పుకార్లను నమ్మవద్దని కోరారు. మంగళవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని దివిటిపల్లి వద్ద ఐటీ కం మల్టీ పర్పస్ ఇండస్ట్రీయల్ కారిడర్లో విద్యార్థులతో మంత్రి సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా వారితో మాట్లాడుతూ సమైకాంధ్ర పాలనలో తెలంగాణ గ్రామాలు వీధిన పడి వలసల పాలయ్యారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ ఆశీస్సులతో జిల్లా రూపురేఖలు మార్చాలన్న లక్ష్యంతో ఉపాధి కల్పనపై దృష్టిని సారించమని వెల్లడించారు. ఇందులో భాగంగా 20 చిన్న పాటి సాఫ్ట్వేర్ సంస్థలను తీసుకువచ్చామని తెలిపారు. జర్మనీ, చైనాల తరువాత ప్రపంచంలోనే అతిపెద్ద పరిశ్రమ లిథియం సెల్ అమర్ రాజా కంపెనీని తీసుకువచ్చామని పేర్కొన్నారు.
అయితే కొందరు ఈ కంపెనీ వల్ల కాలుష్యం ఏర్పాడుతుందని స్థానిక ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని విమర్శించారు. చమురు అడుగంటిన సమయంలో అమర్ రాజా లాంటి కంపెనీ ఎంతో అవసరమని మంత్రి వెల్లడించారు. త్వరలో ఎన్నారైలతో టెలీ కాన్ఫరెన్సు నిర్వహించి పెట్టుబడులను ఆహ్వానిస్తామని తెలిపారు.భ్రమలు, భయాలు సృష్టించే వారి వలలో పడోద్దని ప్రజలకు ఆయన సూచించారు. ఫలాలనిచ్చే సమయంలో వాటిని అడ్డుకుంటే సహించేది లేదని స్పష్టం చేశారు. దివిటిపల్లి వద్ద స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ లు ఏర్పాటు చేస్తామని,పాలమూరులో ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తామని అన్నారు.