హనుమకొండ, మార్చి 20 : ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి దాతలు పెద్ద ఎత్తున విరాళాలు అందించాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ, మండల పరిషత్, జిల్లా ప్రజా పరిషత్ పాఠశాలలో నాణ్యమైన విద్య, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పనకు అమలు చేస్తున్న మన ఊరు – మన బడి కార్యక్రమం ఉమ్మడి వరంగల్ జిల్లాల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసిందన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆరు జిల్లాల్లో విద్యార్థులు ఎక్కువ ఎన్రోల్మెంట్ ఉన్న 1165 పాఠశాలలను ఎంపిక చేశామని మంత్రి తెలిపారు. అందులో భాగంగా జనగామ జిల్లాలో 176 పాఠశాలలను, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 149 పాఠశాలలను, ములుగు జిల్లాలో 125 పాఠశాలలను, వరంగల్ జిల్లాలో 223 పాఠశాలలను, హనుమకొండ జిల్లాలో 176 పాఠశాలలను, మహబూబాబాద్ జిల్లాలో 316 పాఠశాలలను ఎంపిక చేశామని ఆయన వివరాలను వెల్లడించారు.
విద్యార్థులకు నాణ్యమైన కల్పనలో భాగంగా డిజిటల్ విద్యాబోధన ఈ కార్యక్రమంలో భాగంగా ఉంటుందన్నారు. అందుకు అనుగుణంగా అన్ని సదుపాయాలతో డిజిటల్ తరగతి గదుల ఏర్పాటు, అదనపు తరగతుల నిర్మాణం, ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్న తరగతి గదుల మరమ్మతులు, అవసరమైన ఫర్నిచర్, నీటి సదుపాయాలతో కూడిన మరుగుదొడ్లు నిర్మాణం, మౌలిక సదుపాయాలు అయిన టాయిలెట్లు, విద్యుత్ సరఫరా, స్వచ్ఛమైన త్రాగు నీటి సరఫరా, కిచెన్ షెడ్స్, ప్రహరీగోడల నిర్మాణం, ఉన్నత పాఠశాలల్లో డైనింగ్ హాల్స్ నిర్మాణం మున్నగు సదుపాయాలు మన ఊరు – మన బడి కార్యక్రమంలో భాగంగా చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమం అమలులో పారదర్శకత ఉండటానికి ఈ పనులను స్థానిక ప్రజలను భాగస్వాములను చేయడానికి పనుల నిర్మాణ బాధ్యతలను పాఠశాల మేనేజ్మెంట్ కమిటీలకు అప్పగించనున్నట్లు ఆయన చెప్పారు. అందరి ఆకాంక్ష మేరకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి 1 నుండి 8 వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియాన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశ పెడుతామని మంత్రి తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి దాతలు ముందుకు రావాలని మంత్రి దయాకర్ రావు కోరారు. 10 లక్షల రూపాయలు విరాళామిస్తే తరగతి గదికి, 25 లక్షల రూపాయల విరాళామిస్తే ప్రాథమిక పాఠశాలకు, 50 లక్షల విరాళామిస్తే ప్రాధమికోన్నత పాఠశాలకు, కోటి రూపాయలిస్తే ఉన్నత పాఠశాలలకు దాతలు లేదా వారు సూచించిన పేర్లు పెడదామన్నారు. ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలను బలోపేతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.