హైదరాబాద్ : అవయవ దానానికి ప్రజలు ముందుకు రావాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి కోరారు. బుధవారం జయచంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో అవయవదానంపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జీవన్దాన్ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా ఉందని వెల్లడించారు.
ఇప్పటి వరకు 1158 మంది వద్ద అవయవాలు సేకరించి 4057 మంది పునర్జన్మ ఇచ్చారని పేర్కొన్నారు . ప్రజల్లో అవగాహన పెంపొందించి అవయవ దానాన్ని ముందుకు వచ్చేలా కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. మరణించిన తరువాత మట్టిలో కలిసిపోవడం కంటే మరో ఇంటికి వెలుగునివ్వడం గొప్ప విషయమన్నారు.
అవయవ దానంపై సామాజిక రుగ్మతలు , మూఢ నమ్మకాలను విశ్వసించ వద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు చైర్పర్సన్ దేవిరెడ్డి కమలా సుధీర్రెడ్డి, జీవన్దాన్ కో ఆర్డినేటర్ డాక్టర్ భానుచందర్ తదితరులు పాల్గొన్నారు.