హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): ఉక్రెయిన్తో రష్యా యుద్ధం, యూరప్, ఆసి యా దేశాల్లో చమురు కొరత కారణంగా ప్రత్యామ్నాయ ఇంధనమైన బొగ్గు కు విపరీతమైన డిమాండ్ ఏర్పడిందని సింగరేణి డైరెక్టర్ ఎస్ చంద్రశేఖర్ తెలిపారు. ఈ నేపథ్యంలో బొగ్గు ఉత్పత్తి సంస్థలు తమ లక్ష్యాలను పెంచుకొని అధికోత్పత్తి సాధించాల్సిన అవసరం ఏర్పడిందని అన్నారు. ఢిల్లీలో గురువారం గ్లోబల్ కోల్ సెక్టర్ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఇండియా కోల్ 4వ వార్షిక సదస్సులో ఆయన ప్రసంగించారు.
పర్యావరణ పరిరక్షణకు ఉద్గారాలను తగ్గించాలన్న ఉద్దేశంతో పలు దేశా లు బొగ్గు ఉత్పత్తిని తగ్గించుకుంటున్నాయని, అయితే యూరప్లో నెలకొన్న యుద్ధ పరిస్థితుల వల్ల చమురు సరఫరాకు విఘాతం ఏర్పడి, విద్యుత్తు ఉత్పత్తికి బొగ్గు వైపు దృష్టి సారిస్తున్నాయని చెప్పారు. దీంతో బొగ్గుకు డిమాండ్ పెరిగి, ధర కూడా పెరిగిందన్నారు. ఈ క్రమంలో దేశంలోని పారిశ్రామిక వర్గాలు విదేశాల నుంచి అధిక ధరకు బొగ్గును కొనలేరని, దీనివల్ల స్వదే శీ బొగ్గుకు మరింత డిమాండ్ ఏర్పడుతున్నదని అంచనా వేశారు. ఈ క్రమంలో పర్యావరణహితంగా బొగ్గు ఉత్పత్తి, రవాణా చేపట్టాల్సిన అవసరం ఉన్నదన్నారు. ఈ దిశగా సింగరేణి కాలరీస్ కృషి చేస్తున్నదని, సొంతంగా రెండుచోట్ల రైలు మార్గాలను నిర్మించుకున్నదని, పెద్ద ఎత్తున మొక్కలు నాటుతూ.. వనాలు పెంచుతున్నదని తెలిపారు. ఈ సదస్సులో కేంద్ర బొగ్గు, రైల్వే శాఖ సహాయ మంత్రి రావ్ సాహిబ్ పాటిల్ ధాన్వే తదితరులు ప్రసంగించారు.