Air India : గత ఏడాది జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంపై తుది నివేదికను వచ్చే అక్టోబర్లో సమర్పిస్తామని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ ప్రమాదంపై ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) విచారణ జరుపుతోంది. ప్రమాదం జరిగి ఏడాది గడిచినా ఇంకా ప్రభుత్వానికి నివేదిక అందలేదు. దీనిపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా, జస్టిస్ వి.మోహన ఆధ్వర్యంలోని బెంచ్ మంగళవారం విచారణ జరిపింది.
ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు సమాధానం ఇచ్చారు. ఈ ప్రమాదంపై ఏఏఐబీ ఆధ్వర్యంలో విచారణ జరుగుతోందని, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పైలట్స్ అవసరమైన సమాచారాన్ని కూడా అందిస్తారని కోర్టుకు తెలిపారు. ఈ సూచనల్ని ఏఏఐబీ సమీక్షిస్తుందని, విచారణ సమయంలో అవసరమైతే వాటిని పరిశీలిస్తుందన్నారు. ప్రమాదానికి సంబంధించి నాలుగు సిమ్యులేషన్ టెస్టులు పూర్తయ్యాయని తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. ఇంతకుముందు ఇదే అంశంపై ఏఏఐబీ కూడా కోర్టుకు కొన్ని కీలక వివరాలు సమర్పించింది. కాక్పిట్ వాయిస్ రికార్డింగ్స్, విమానం ఎగిరేటప్పుడు పైలట్లకు సంబంధించిన ఫొటోల్ని బహిరంగంగా వెల్లడించడం కుదరదని కోర్టుకు తెలిపింది.
తాజా పరిస్థితికి సంబంధించి అక్టోబర్ మొదటి వారంలో విమాన ప్రమాదంపై తుది నివేదికను కోర్టుకు సమర్పిస్తామని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కేసు విచారణను సుప్రీంకోర్టు అక్టోబర్ 13కు వాయిదా వేసింది. గత ఏడాది జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్ బయల్దేరిన ఎయిరిండియాకు చెందిన బోయింగ్ 787-8 అనే ఏఐ171 విమానం ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ విమానం కూలిన ఘటనలో 250 మందికిపైగా మరణించారు.