చిగురుమామిడి/అక్కన్నపేట/ఎల్కతుర్తి, జూలై 5: హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలతో సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గుజరాత్ రాష్ర్టానికి చెందిన అమూల్, కర్ణాటకకు చెందిన నంది, తమిళనాడుకు చెందిన ఆరోక్య పాలు, చిత్తూరుకు చెందిన హెరిటేజ్ పాలు సరఫరా అవుతున్నాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ తెలిపారు. మనకు ఈ పాలు అవసరమా?, మనమే పాలను ఉత్పత్తి చేసుకోలేమా? అని ప్రశ్నించారు. మంగళవారం ఆయన కరీంనగర్ డెయిరీ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరి, హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం ఇందిరానగర్, సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం అంతకపేటలో పదివేల లీటర్ల చొప్పున సామర్థ్యమున్న పాల శీతలీకరణ కేంద్రాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా వినోద్కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ వ్యాప్తంగా రోజూ లక్షలాది లీటర్ల పాలు అవసరమని, రైతులు వ్యవసాయంతోపాటు పాల ఉత్పత్తిపై దృష్టి సారించాలని సూచించారు. పాల ఉత్పత్తితో అదనంగా లాభాలను ఆర్జించవచ్చన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఇంట్లో పాడి గేదెలను ఏర్పాటు చేసుకొని పాల ఉత్పత్తిని సాధించాలని చెప్పారు. ఉత్పత్తి చేసిన పాలను కొనుగోలు చేసేందుకు కరీంనగర్ డెయిరీ సిద్ధంగా ఉన్నదని తెలిపారు. నిత్యం ప్రతి ఇంట్లో అనేక రకాల ఖర్చులు పెరుగుతున్నాయని, పాల ఉత్పత్తి ద్వారా ఆ ఖర్చుల భారాన్ని అధిగమించవచ్చని అభిప్రాయపడ్డారు. ఆయా కార్యక్రమాల్లో హుస్నాబాద్ ఎమ్మెల్యే ఒడితెల సతీశ్కుమార్, కరీంనగర్ డెయిరీ సంస్థ చైర్మన్ చల్మెడ రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.