Government Doctors | హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): ‘ఐసీయూలో ఉన్న రోగులకు చికిత్స చేసి ప్రాణాలు కాపాడాలా? లేక ఎలుకలు పట్టుకుంటూ కూర్చోవాలా?’ అంటూ ప్రభుత్వ దవాఖానల వైద్యులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కామారెడ్డి ప్రభుత్వ దవాఖాన ఐసీయూలో ఓ రోగిని ఎలుకలు కరిచిన ఘటనలో డాక్టర్లపై ప్రభుత్వం చర్యలు చేపట్టడంపై భగ్గుమన్నారు.
టీటీజీడీఏ, ఇతర వైద్య సంఘాల పిలుపు మేరకు టీచింగ్ హాస్పిటళ్లు, జిల్లా దవాఖానలు, టీవీవీపీ పరిధిలోని వైద్యులు సోమవారం నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరై నిరసన తెలిపారు. ఆ ఘటన జరిగినప్పుడు దవాఖానలో లేని అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సంపత్పై చర్యలు తీసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోగిని ఎలుక కరిస్తే సంబంధిత శానిటేషన్ ఏజెన్సీ బాధ్యత వహించాల్సి ఉంటుందని, వైద్యులు ఎలా బాధ్యులవుతారని నిలదీశారు. డాక్టర్లపై వెంటనే సస్పెన్షన్ ఎత్తివేయాలని, లేదంటే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
‘గాంధీ’లోనే వసంత్
ఈ ఘటనలో సస్పెన్షన్కు గురైన అసోసియేట్ ప్రొఫెసర్ వసంత్ కుమార్ ఈ నెల 9 నుంచి 11 వరకు హైదరాబాద్లోని గాంధీ మెడికల్ కాలేజీలో జరుగుతున్న 2019 ఎంబీబీఎస్ బ్యాచ్ పరీక్షలకు ఎగ్జామినర్గా హాజరైనట్టు గాంధీ మెడికల్ కాలేజీ డిపార్ట్మెంట్ ఆఫ్ మెడిసిన్ ప్రకటించింది. దీంతో దవాఖానలోనే లేని వ్యక్తిని ఎలా సస్పెండ్ చేస్తారన్న ప్రశ్న మరింత బిగ్గరగా వినిపిస్తున్నది.
నిర్లక్ష్యానికి పరాకాష్ట
కామారెడ్డి ఘటనలో డాక్టర్లపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడాన్ని అత్యంత నిర్లక్ష్యపూరిత చర్యగా ఐఎంఏ తెలంగాణ శాఖ అభివర్ణించింది. డాక్టర్లపై సస్పెన్షన్ ఎత్తివేయాలని లేదంటే ఉద్యమం చేస్తామని ఐఎంఏ అధ్యక్షుడు కాళీ ప్రసాద్రావు, కార్యదర్శి విజయ్రావు హెచ్చరించారు. డాక్టర్లను సస్పెండ్ చేయడాన్ని హెల్త్ కేర్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్, తెలంగాణ కాంట్రాక్ట్ డాక్టర్స్ అసోసియేషన్ కూడా తీవ్రంగా ఖండించాయి.
నివేదిక అందాక చర్యలు: రాజనర్సింహ
కామారెడ్డి ఘటనపై విచారణకు ఆదేశించామని, నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. సోమవారం హైదరాబాద్లో తనను కలిసిన తెలంగాణ ప్రభుత్వ డాక్టర్ల అసోసియేషన్, తెలంగాణ వైద్య విధాన పరిషత్ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ.. రెండు, మూడు రోజుల్లో పూర్తిస్థాయి విచారణ నివేదిక తెప్పించుకుంటామని, దాని ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు.