హైదరాబాద్, జూన్1 (నమస్తే తెలంగాణ): లింగనిర్ధారణ పరీక్షలు చేసే వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించొద్దని ఇండియన్ మెడికల్ అసోసియేషన్( తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బీఎన్రావు కోరారు. ఇటీవల వరంగల్ జిల్లా సంఘటనపై స్పందిస్తూ అసోసియేషన్ తరఫున గురవారం ఒక ప్రకటన విడుదల చేశారు. చట్టవ్యతిరేకంగా అబార్షన్లు చేస్తున్న గ్యాంగ్ను పట్టుకున్న వైద్యాధికారులు, పోలీసులకు అభినందనలు తెలిపారు. చట్టవ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడే వారు ఎంతటివారైనా సరే, అరెస్టు చేసి శిక్షించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.
పీఎన్డీటీ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని తెలిపారు. మొదటిసారి తప్పు చేస్తే మూడేండ్లు, ఆ తర్వాత కూడా చేస్తే ఐదేండ్ల శిక్ష ఉంటుందని హెచ్చరించారు. ఆడపిల్లలపై వివక్ష చూపొద్దని, గర్భంలోనే ఆడపిల్లలను తుంచివేయొద్దని కోరారు. దీంతో సమాజానికి భవిష్యత్తులో చేటు కలుగుతుందని హెచ్చరించారు. అలాంటి కార్యకలాపాలకు ఉన్నత విద్యను అభ్యసించిన డాక్టర్లు సహకరించకూడదని విజ్ఞప్తి చేశారు.