నల్లగొండ: పీసీసీ ఉపాధ్యక్షుడు, తెలంగాణ ఉద్యమకారుడు డాక్టర్ చెరుకు సుధాకర్ (Cheruku Sudhakar) సొంతగూటికి చేరన్నారు. కాంగ్రెస్లో బీసీలకు స్థానం లేదంటూ ఆ పార్టీకి రాజీనామా చేసిన ఆయన నేడు బీఆర్ఎస్లో చేరనున్నారు. శనివారం మధ్యాహ్నం ఒంటి గంటకు తెలంగాణ భవన్లో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్నారు. రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిల భూస్వామ్య ఆధిపత్య ధోరణి తీవ్రంగా బాధిస్తున్నాయంటూ విమర్శించారు. ఆత్మగౌరవం లేని రాజకీయ ప్రయాణం నిష్ప్రయోజనం అని పేర్కొంటూ ఘాటుగా స్పందించారు.
బీసీ నేతల విషయంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డితోపాటు కాంగ్రెస్ నేతల తీరును నిరసిస్తూ డాక్టర్ చెరుకు సుధాకర్ ఆ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఏ పదవీ లేకపోయినా భరించవచ్చు గానీ ఆత్మగౌరవం లేని రాజకీయ ప్రయాణం నిష్ప్రయోజనం అని భావించి రాజీనామా చేస్తున్నట్టు శుక్రవారం ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీలో ఆర్థిక పరిపుష్టి కలిగిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి వంటి వారికే ప్రాధాన్యం ఇస్తున్నారని, మధుయాష్కీ వంటి బీసీల నేతల స్థాయిని తగ్గిస్తూ అవమానకరంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ చెప్తున్న సామాజిక న్యాయం కేవలం రాహుల్గాంధీ, ప్రియాంకాగాంధీ మాటల్లో తప్ప ఆచరణలో లేదని విమర్శించారు. ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారం బీసీలకు సీట్లు ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీ చివరకు మోసం చేసిందని దుయ్యబట్టారు. బీసీలకు కేటాయించిన 12 సీట్లలో ఐదు చోట్ల ఎప్పుడూ కాంగ్రెస్కు డిపాజిట్ రాలేదని చెప్పారు.
వీటిని పట్టుకుని బీసీలకు 12 సీట్లు ఇచ్చామంటూ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వెక్కిరింపు మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పొన్నాల లక్ష్మయ్య రాజీనామా సమయంలో రేవంత్రెడ్డి అత్యంత అవమానకరంగా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తంచేశారు. గెలుపు గుర్రాల పేరుతో నందికంటి శ్రీధర్ వంటి వాళ్లను బలిపశువులను చేశారని, బీసీలకు ఇంతకంటే అవమానం ఏముంటుందని ప్రశ్నించారు. కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఇష్టారీతిలో వ్యవహరిస్తూ తన సొంత నియోజకవర్గమైన నకిరేకల్లో కనీస సమాచారం కూడా ఇవ్వకుండా వేముల వీరేశాన్ని అభ్యర్థిగా ప్రకటించారని పేర్కొన్నారు. భట్టి విక్రమార్క సాక్షిగా నకిరేకల్ గడ్డపై తనను మాట్లాడనీయకుండా కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మనుషులు అడ్డుకున్న విషయం అక్కడి ప్రజలు మర్చిపోలేదని చెప్పారు. ప్రజా తెలంగాణ లక్ష్యమని చెప్తున్న కాంగ్రెస్ పెద్దలు కరుడుగట్టిన భూస్వామ్య స్వభావంతో వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు.