హైదరాబాద్ : ఎఫ్ఆర్వో శ్రీనివాసరావు హత్య తర్వాత రాష్ట్ర ప్రభుత్వం, అన్ని స్థాయిల్లో వేగంగా స్పందించి కుటుంబానికి అండగా నిలవటంతో పాటు, అటవీ సిబ్బందికి నైతిక మద్దతు ప్రకటించాయని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్, హెచ్ఓఓఎఫ్) ఆర్ఎం డోబ్రియాల్ అన్నారు. రాష్ట్ర స్థాయి అటవీ ఉద్యోగులతో అటవీ సంరక్షణ ప్రధాన అధికారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎఫ్ఆర్వో కుటుంబానికి తక్షణ ప్యాకేజీ ప్రకటించిన ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావుకు పీసీసీఎఫ్ కృతజ్జతలు తెలిపారు. ఇప్పటికే అటవీ ఉద్యోగ సంఘాలు అన్నింటితో ఒకసారి చర్చించిన పీసీసీఎఫ్, సుదీర్ఘ వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా క్షేత్రస్థాయి సమస్యలపై మరోసారి అన్ని స్థాయిల ఉద్యోగుల అభిప్రాయాలు తెలుసుకున్నారు.
ఉద్యోగుల భద్రత, రక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ విషయం ఇప్పటికే సీఎం స్పష్టంచేశారని, డీజీపీ కూడా స్పష్టమైన ఆదేశాలు పోలీస్ శాఖ సహకారంపై ఇచ్చారని డోబ్రియాల్ తెలిపారు. సిబ్బందికి ఆయుధాలు, ఫారెస్ట్ స్టేషన్ల ఏర్పాటు (తొలి దశ ప్రతిపాదన 30 స్టేషన్లు, ఒక్కో దాంట్లో 18 మంది సిబ్బందితో), చట్టపరంగా అటవీ నిందితులపై కఠిన చర్యలు, కొత్త నియామకాలు, వాహనాలపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు సిద్ధం చేసి, త్వరగా ఆమోదం పొందేలా చూస్తామని హామీ ఇచ్చారు. గుత్తికోయలతో విలువైన అడవికి జరుగుతున్న నష్టం, నివారణ చర్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని తెలిపారు.
ప్రాధాన్యతా క్రమంగా పోడు సమస్య పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తున్నందున, ఆర్వోఎఫ్ఆర్ చట్టం ప్రకారం సంబంధిత ప్రక్రియలో అటవీ శాఖ సిబ్బంది తప్పనిసరిగా పాల్గొనాలని పీసీసీఎఫ్, హెచ్ఓఓఎఫ్ ఆదేశించారు. క్షేత్ర స్థాయి సిబ్బంది సమస్యలు, భద్రతపై ఉన్నతాధికారులకు, ప్రభుత్వానికి సానుభూతి ఉందని, పరిష్కార మార్గాలు వీలైనంత త్వరగా అమలు అవుతాయనే ఆశాభావం వ్యక్తం చేశారు. జంగల్ బచావో – జంగల్ బడావో నినాదాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లి, ప్రజా ప్రతినిధులు, అన్ని వర్గాల మద్దతుతో అడవులను కాపాడాల్సిన బాధ్యత అటవీ అధికారులపై ఉందన్నారు. అడవులకు నష్టం కలిగేలా, సిబ్బందికి హాని కలిగించేలా ఎవరు వ్యవహరించినా చట్ట పరిధిలో చర్యలతో పాటు, ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని పీసీసీఎఫ్ తెలిపారు.