పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ
హైదరాబాద్, ఫిబ్రవరి 28 : తెలంగాణ రాష్ట్ర అటవీశాఖ కొత్త అధిపతి(పీసీసీఎఫ్)గా సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి రాకేశ్మోహన్ డోబ్రియల్ నియమితులయ్యారు. ప్రస్తుతం పీసీసీఎఫ్గా ఉన్న ఆర్ శోభ పదవీ విరమణ పొందటంతో ఆయనకు పీసీసీఎఫ్గా, హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ (హెచ్వోఎఫ్ఎఫ్)గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం డోబ్రియల్ సోషల్ ఫారెస్ట్రీకి పీసీసీఎఫ్గా, తెలంగాణకు హరితహారం రాష్ట్ర నోడల్ అధికారిగా పనిచేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ సిబ్బంది, శిక్షణ వ్యవహారాలశాఖ లాంఛనాలు పూర్తిచేసిన తరువాత పూర్తిస్థాయి పీసీసీఎఫ్గా ఆయన కొనసాగే అవకాశం ఉన్నది. ఉత్తరాఖండ్కు చెందిన డోబ్రియల్ 1987లో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్లో చేరారు. తొలుత పాల్వంచ సబ్ డీఎఫ్వోగా, ఆ తర్వాత భద్రాచలం, వరంగల్, బెల్లంపల్లిలో డివిజనల్ ఫారెస్ట్ అధికారిగా పనిచేశారు. 2002లో కన్జర్వేటర్గా పదోన్నతి పొందారు. ఆ తరువాత అడిషనల్ సెక్రటరీ హోదాలో సచివాలయంలో వ్యవసాయశాఖ, ఉన్నత విద్యాశాఖల్లో వివిధ హోదాల్లో డిప్యుటేషన్పై పనిచేశారు. స్పెషల్ సెక్రటరీ హోదాలో ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా, వివిధ యూనివర్సిటీలకు (2003-14 వరకు) ఇంచార్జ్జి వైస్చాన్స్లర్గా వ్యవహరించారు. 2015లో అదనపు పీసీసీఎఫ్ హోదాలో తిరిగి అటవీశాఖలో చేరి, విజిలెన్స్, ఫారెస్ట్ ప్రొటెక్షన్ విధులు నిర్వహించారు. 2016లో తెలంగాణకు హరితహారం నోడల్ ఆఫీసర్గా నియమితులయ్యారు. అన్ని శాఖలను సమన్వయం చేసి, హరితహారాన్ని విజయవంతం చేయడంలో కీలకపాత్ర పోషించారు. 2020లో పీసీసీఎఫ్ ర్యాంకు పొందిన ఆయన 2025 ఏప్రిల్ వరకు సర్వీసులో కొనసాగనున్నారు. డోబ్రియల్ను అటవీ, పర్యావరణశాఖల మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి, పదవీ విరమణ పొందిన పీసీసీఎఫ్ ఆర్ శోభ, అటవీశాఖ ఉన్నతాధికారులతో పాటు స్టేట్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్, రేంజ్ ఆఫీసర్స్ అసోసియేషన్, జూనియర్ ఆఫీసర్ల సంఘం ప్రతినిధులు, సిబ్బంది అభినందించారు.
ప్రభుత్వ సలహాదారుగా ఆర్ శోభ
అటవీ సంరక్షణ ప్రధానాధికారి(పీసీసీఎఫ్) ఆర్ శోభ సోమవారం పదవీ విరమణ పొందారు. అదేరోజు ఆమె రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా (అటవీ వ్యవహారాలు) నియమితులయ్యారు. ఈ హోదాలో ఆమె రెండేండ్ల పాటు కొనసాగుతారని సీఎస్ సోమేశ్కుమార్ జారీచేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పీసీసీఎఫ్గా పదవీ విరమణ పొందిన శోభకు అరణ్యభవన్లో ఘనంగా వీడ్కోలు పలికారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి ఆమె సేవలను కొనియాడారు. ప్రభుత్వ సలహాదారుగా శోభను నియమించిన విషయాన్ని ప్రకటించి, అభినందించారు. పదవీ విరమణ సందర్భంగా అటవీశాఖ అధికారులు, సిబ్బంది శాలువా, పూలమాలతో ఆమెను సన్మానించారు. ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో శోభను కూర్చొబెట్టి, గౌరవ వందనంతో వీడ్కోలు పలికారు.